భూమి మీద మనిషి పుట్టినప్పటి నుంచి ప్రయాణిస్తూనే వున్నాడు.తిండి కోసం, స్థిర జీవనం కోసం మనిషి నిరంతర ప్రయాణం సాగించేవాడు.
ఆ ప్రయాణంలో వేటలుండేవి, కొట్లాటలుండేవి, నిరంతర యుద్ధం చేసే వాడు.కాలం గడిచింది ఖండాలు, దేశాలు ఏర్పడ్డాయి, పాలకులు,పాలితులు ఏర్పాడ్డారు.
మనిషి స్థిర జీవనం ఏర్పరుచుకోవటమే లక్ష్యంగా విశేష కృషి జరిగింది.మనిషికి తెలివితేటలు పెరిగాయి అభివృద్ధి పెరిగింది, కానీ నేటికీ మనిషి ప్రయాణం సాగిస్తూనే ఉన్నాడు.
ఒకప్పుడు తన కోసం ప్రయాణిస్తే, ఇప్పుడు మరొకడు తరిమితే ప్రయాణిస్తున్నాడు, ఒకప్పుడు ఆకలితో ప్రయాణిస్తే ఇప్పుడు భయంతో ప్రయాణిస్తున్నాడు.
ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పెరుగుతున్న వలసలను పరిగణలోకి తీసుకున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 1990 డిసెంబర్ 18న జరిగిన సమావేశంలో వలస కార్మికులు వారి కుటుంబ సభ్యుల హక్కుల రక్షణ గురించి ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
ప్రపంచ వ్యాప్తంగా అంతర్గత, అంతర్జాతీయ వలస వెళ్తున్న పౌరులందరి కోసం డిసెంబర్ 18న అంతర్జాతీయ వలసదారుల దినోత్సవంగా ప్రకటించింది.ప్రజలు వలసలతో పలు అవకాశాలను పొందగలుగుతున్నప్పటికీ కష్టాలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది.
వలసలకు ఎన్నో కారణాలు ఉన్నాయి.
21వ శతాబ్ధంలో విద్య, ఉపాధి అవకాశాలతో పాటు ఆయా దేశాల్లో అంతర్యుద్ధాల కారణంగా మనిషి ఎన్నో వ్యయ ప్రయాసలకొర్చి తన ప్రయాణాన్ని ఖండాలను దాటిస్తున్నాడు.ఇక భారతదేశం విషయానికి వస్తే… మనవాళ్లు ఉన్నత జీవన ప్రమాణాలను వెతుక్కుంటూ ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా భారతీయులు లేని దేశం లేదంటే అతిశయోక్తి కాదు.
అధికారిక లెక్కల ప్రకారం 130కి పైగా దేశాలలో 3 కోట్లమంది ప్రవాస భారతీయులు నివసిస్తున్నారని అంచనా.
దేశం కానీ దేశంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఎన్ఆర్ఐలు మనదేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని అందజేస్తున్నారు.దీనితో పాటు మాతృభూమి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో ఎన్నో సామాజిక కార్యక్రమాలకు భారీ విరాళాలు అందిస్తున్నారు.భారతదేశ అభివృద్ధికి విదేశాల్లో ఉన్న భారతీయుల సహకారాన్ని, వారి ప్రాధాన్యాన్ని గుర్తించి గౌరవించుకోవడానికే ప్రతి ఏటా ‘ప్రవాస భారతీయుల దినోత్సవం’ జరుపుకుంటున్నాం.1915లో దక్షిణాఫ్రికా నుంచి మహాత్మాగాంధీ ముంబైకి తిరిగి వచ్చిన జనవరి 9న ఈ వేడుక జరుపుకుంటున్నాం.2003 నుంచి ఏటా ఒక భారతీయ నగరంలో ఈ వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు.ఈ సందర్భంగా వివిధ రంగాల్లో కృషి చేసిన ప్రవాస భారతీయులకు భారత రాష్ట్రపతి ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారాలను అందజేస్తారు.