వ్యోమగామిగా మారి చంద్రుడు, అంగారకుడి మీదకు వెళ్లాలనుకునే వారికి నాసా ఆహ్వానం పలికింది.యూఎస్ పౌరుడిగా ఉండి సంబంధిత రంగంలో మాస్టర్స్ డిగ్రీ పట్టా కలిగి, భూమికి 250 కిలోమీటర్ల ఎత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నివసించడానికి, పనిచేయడానికి సిద్ధంగా ఉన్న వారు తమను సంప్రదించాలని నాసా కోరింది.
రాబోయే సంవత్సరాల్లో అంతరిక్ష కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికల్లో వ్యూహాంగా భాగంగా 48 మంది చురుకైన సిబ్బందిని నియమించుకోవాలని నాసా భావిస్తోంది.
లో ఎర్త్ ఆర్బిట్లోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తాము విజయవంతంగా 20వ ఏడాదిని జరుపుకుంటున్నామని నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్ స్టైన్ తెలిపారు.ఈ క్రమంలో 2024 నాటికి చంద్రుడిపైకి మొదటి మహిళను, ఆ తర్వాత పురుషుడిని పంపే దిశగా ప్రయత్నాలు ప్రారంభించామని ఆయన వెల్లడించారు.ప్రతిభావంతులైన మహిళలు, పురుషులను తమ వ్యోమగామి బృందంలో చేర్చుకుంటామని, అర్హులైన అమెరికన్లందరూ మార్చి 2 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చునని జిమ్ స్పష్టం చేశారు.
వ్యోమగామిగా దరఖాస్తు చేసుకునేవారు ఎంతో పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్లో మాస్టర్స్ డిగ్రీ అలాగే రెండేళ్ల పీహెచ్డీ చేసి టెస్ట్ పైలట్గా వున్న వ్యక్తులు ఈ వ్యోమగామి ప్రోగ్రామ్కు అర్హులు.మెడికల్ డిగ్రీ లేదా ఆస్టియోపతిక్ మెడిసిన్ వున్న వారు కూడా ఇందుకు అర్హులే.అభ్యర్ధులకు కనీసం రెండేళ్ల వృత్తిపరమైన అనుభవం ఉండాలి.పైలట్ల విషయానికి వస్తే 1,000 గంటల పైలట్ ఇన్ కమాండ్గా వ్యవహరించి ఉండాలి.ప్రాసెస్ సమయంలో అభ్యర్ధులు రెండు గంటల పాటు ఆన్లైన్ పరీక్షను రాయాల్సి ఉంటుంది.
ఈ పరీక్ష ఎంత కఠినంగా ఉంటుందంటే 18,000 మంది దరఖాస్తు చేసుకుంటే 11 మంది వ్యోమగాములుగా ఎంపికయ్యారు.
ఎంపికైన అభ్యర్థులకు టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్లో రెండేళ్ల శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది.ఇందులో భాగంగా అండర్ వాటర్ న్యూట్రల్ బ్యూయెన్సీ ల్యాబ్, రోబోటిక్స్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వ్యవస్థలు, టీ-38 జెట్పై శిక్షణ, రష్యన్ భాషపై తరగతులు ఉంటాయి.వ్యోమగాములుగా ఎంపికైనవారిలో సగం మంది మిలటరీ నుంచి వచ్చినవారే.
ఇక జీతభత్యాల విషయానికి వస్తే ఫెడరల్ వర్కర్స్ 11వ గ్రేడ్ కింద 53,800 డాలర్ల నుంచి 70,000 డాలర్లను వేతనంగా చెల్లిస్తారు.