కరోనాపై ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలబడేందుకు ఎవరికీ తోచిన దారిలో వారు సహాయం చేస్తున్నారు.ఇప్పటికే టాలీవుడ్ సెలబ్రిటీలు కరోనాపై పోరాటంలో తమవంతు సాయంగా విరాళాలు అందించారు.
ఇప్పుడు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాపై పోరాటంలో సేవలందిస్తున్న వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల కోసం నిధులు సేకరించడానికి పాటలు పాడాలని నిర్ణయించుకున్నారు.అది కూడా పేస్ బుక్ లో.ఇందులో యూజర్స్ అడిగిన పాటని పాడి వినిపిస్తా అని దానికి ఒక్కొక్కరు వంద రూపాయిలు చెల్లించాలని పేస్ బుక్ లో లైవ్ లో చెప్పారు.ఇలా యూజర్స్ నుంచి వచ్చిన సొమ్ముని కరోనాపై పోరాటానికి విరాళంగా ఇస్తానని ప్రకటించారు.
తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో సినిమా, భక్తి గీతాలు ఏవైనా పాడమని అడగొచ్చని, అయితే ముందు అడిగిన వారికే ప్రాధాన్యత ఉంటుందని బాలసుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు.శనివారం, సోమవారం, బుధవారం, గురువారాల్లో రాత్రి 7 గంటల నుంచి 7.30 గంటల వరకు అరగంట పాటు పాడతానని, అయితే సమయాభావం వలన ఒక పల్లవి, ఒక చరణంతో ముగిస్తానని వెల్లడించారు.తన పాటలు నేరుగా లైవ్ లో వినాలనుకునే వారు రుసుం చెల్లించేందుకు బ్యాంకు ఖాతా నంబరు తదితర వివరాలను ఫేస్ బుక్ లో తెలియజేస్తానని పేర్కొన్నారు.
వచ్చిన నిధులను పీఎం రిలీఫ్ ఫండ్ కు ఇవ్వాలో, ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వాలో శ్రోతల అభిప్రాయాలను బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.మొత్తానికి బాలుగారు తన స్టైల్ పేస్ బుక్ లో పాటలు పాడి కరోనాకి అందించే సాయంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయడం నిజంగా గొప్ప విషయం.
మరి దీనికి ఏ స్థాయిలో స్పందన వస్తుంది అనేది వేచి చూడాలి.