ప్రముఖ గాయకుడు,గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి పై తాజాగా ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ మరోసారి ట్విట్టర్ ద్వారా స్పందించారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగైంది అని వైద్యుల చికిత్సకు ఆయన స్పందిస్తున్నారు అని చరణ్ తెలిపారు.
అలానే నిదానంగా నాన్న కోలుకొంటున్నారని,ఆసుపత్రిలో వైద్యం కొనసాగుతుంది అని చరణ్ అన్నారు.గాన గంధర్వుడు ఎస్పీ బాలు గతనెల 5 వ తేదీన కరోనా బారిన పడడం తో చెన్నై లోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.
అయితే తొలుత ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ క్రమ క్రమంగా పరిస్థితి విషయమించడం తో ఆయనను ఐసీయూ కు తరలించి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.గత కొద్దీ రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న బాలు ఆరోగ్య పరిస్థితి పై ఎప్పటికప్పుడు ఆసుపత్రి వర్గాలు బులిటెన్ ను విడుదల చేస్తుండగా, మరోపక్క బాలు కుమారుడు ఎస్పీ చరణ్ కూడా ట్విట్టర్ ద్వారా విషయాలను ఎప్పటికప్పుడు ఆయన అభిమానులకు వెల్లడిస్తూనే ఉన్నారు.
కొద్దీ రోజులుగా ఆయన ఆరోగ్యం మెరుగవుతుంది అని ఫిజియోథెరపీ కూడా అందిస్తున్నట్లు చరణ్ తెలిపారు.
బాలు కి కరోనా సోకిన రెండు మూడు రోజుల తరువాత ఆయన సతీమణి కి కూడా కరోనా సోకిన విషయం విదితమే.
ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉన్నట్లు సమాచారం.కరోనా బారిన పడిన బాలు త్వరగా కోలుకోవాలని అటు సినీ ప్రముఖులు,ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ప్రార్ధనలు కూడా చేశారు.
ప్రస్తుతం ఆయన బాగానే కోలుకుంటున్నారు అని చరణ్ తెలపడం తో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.