ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ఏడాదిన్నర కావొస్తున్నా ఈ భూగోళాన్ని విడిచిపెట్టకపోగా.సరికొత్తగా శక్తిని సంతరించుకుని మానవాళిపై పంజా విసురుతోంది.
సెకండ్ వేవ్ పేరిట యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇటలీలను వణికించిన వైరస్.ఇఫ్పుడు భారత్లో మరణ మృదంగాన్ని మోగిస్తోంది.
ప్రపంచంలో కరోనా మహమ్మారి వెలుగు చూసిన నాటి నుంచి ఎన్నడూ లేని విధంగా ఇండియాలో కేసులు నమోదవుతున్నాయి.ఏకంగా 4 లక్షల పైచిలుకు కేసులు, 3 వేలకు పైగా మరణాలు చోటు చేసుకుంటున్నాయి.
భారత్లోని పరిస్థితిపై కొత్త కొత్త విశ్లేషణలు, అధ్యయనాలు వెలుగులోకి వస్తున్నాయి.తాజాగా యూకేలోని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ (ఎల్ఎస్హెచ్టీఎమ్) నేతృత్వంలోని జరిగిన పరిశోధనకు సంబంధించిన వివరాలు లాన్సెట్ అనే మెడికల్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.దీని ప్రకారం.యూకేలో స్థిరపడిన దక్షిణాసియన్లు కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావానికి అధికంగా గురయ్యే అవకాశం వుందని అధ్యయనంలో తేలింది.వీరిలో ఎక్కువ మంది ఆసుపత్రులు, ఐసీయూల్లో చేరాల్సి రావొచ్చని హెచ్చరించింది.యూకే వ్యాప్తంగా 17 మిలియన్ల మంది దక్షిణాసియన్లపై ఈ అధ్యయనం చేసినట్లు పరిశోధకులు వెల్లడించారు.
మొదటి దశతో పోలిస్తే వీరిలో పాజిటివిటి రేటు కూడా అధికంగా వుండే అవకాశం వుందట.గతేడాది మొదటి దశలో శ్వేతజాతీయులతో పోలిస్తే… దక్షిణాసియన్లలో ఈ ఏడాది సెకండ్ వేవ్ ప్రారంభంలో పాజిటివిటి రేట్, ఆసుపత్రుల్లో చేరడం, ఐసీయూ, డెత్ రేటు తక్కువగా వుందని అధ్యయనం వెల్లడించింది.
అయితే కొన్ని దక్షిణాసియా వర్గాలలో ఇది ఒకే రకంగా లేదని ఎల్ఎస్హెచ్టీఎంకు చెందిన డాక్టర్ రోహిణి మాథుర్ తెలిపారు.ఇది యూకేలో జాతుల వారిగా వున్న జనాభా అవసరాలకు తగిన సమర్థవంతమైన నివారణ చర్యలను కనుగొనవలసిన అవసరాన్ని స్పష్టం చేస్తోందని రోహిణి అన్నారు.
దక్షిణాసియా జాతులలో బీఎంఐ, రక్తపోటు, అంతర్లీనంగా వున్న అనారోగ్య సమస్యలు వంటి అంశాలు అదనంగా నష్టాన్ని కలగజేస్తున్నాయని పరిశోధకులు తెలిపారు.ఒకే ఇంట్లో నివసించే వివిధ తరాలు (పిల్లలు, పనిచేసే వ్యక్తులు, వృద్ధులు) వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువగా వుండి వీరిని ప్రమాదంలో పడేసే అవకాశం వుందని డాక్టర్ రోహిణి తెలిపారు.మరోవైపు కోవిడ్ 19 వ్యాక్సిన్ను ఈ మైనారిటీ జాతులు తక్కువగా తీసుకుంటున్నాయని వీరి పరిశోధనలో తేలింది.
నేషనల్ హెల్త్ మిషన తరపున ఈ పరిశోధనా బృందం ఓపెన్ సేఫ్లి డేటా అనలిటిక్స్ ప్లాట్ఫామ్ను ఉపయోగించి ఈ విశ్లేషణ చేసింది.
ఇంగ్లాండ్లోని 40 శాతం ఆరోగ్య అవసరాలు తీరుస్తున్న జనరల్ ప్రాక్టీషనర్స్ నుంచి ఈ ఎలక్ట్రానిక్ డేటాను సేకరించింది.ఈ డేటాలో మొదటి , రెండవ దశలో కరోనా బారినపడిన వారి వివరాలు వున్నాయి.
అలాగే చికిత్స తీసుకున్న వారు స్వయంగా తమ జాతిని నివేదించారు.దీంతో పరిశోధకులు ఈ జాతులను తెలుపు, దక్షిణాసియా, నలుపు, ఇతర మిశ్రమ వర్గాలుగా అనంతరం 16 ఉపవర్గాలుగా విభజించారు.
ఫ్రంట్ లైన్ ఉద్యోగాల్లో ఉండటం, ఆరోగ్య సంరక్షణకు అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో దక్షిణాసియా సమూహాలు ఈ సెకండ్ వేవ్లో అధిక తీవ్రతను ఎదుర్కొనే అవకాశం వుందని పరిశోధకులు తేల్చారు.కాగా, ఇప్పటి వరకు యూకేలో జరిగిన అన్ని అధ్యయనాల్లో ఇదే అతిపెద్దది.
దీనికి యూకే మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ నిధులు సమకూర్చింది.అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్తో పాటు ఎల్ఎస్హెచ్టీఎం, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సహ పలు విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.