మనుషులంతా ఒక్కటేనని.రంగు, లింగం ఆధారంగా వారి పట్ల వివక్ష వుండరాదని పోరాటం జరిపి దక్షిణాఫ్రికాలో నల్లజాతి హక్కుల్ని సాధించిన మహనీయుడు నెల్సన్ మండేలా.
ఆయనతో పాటు ఈ పోరాటంలో పాల్గొన్న హక్కుల నేత, భారత సంతతికి చెందిన ఇబ్రహీం ఇస్మాయిల్ కన్నుమూశారు.ఆయన వయసు 84 సంవత్సరాలు.
హక్కుల పోరాటంలో భాగంగా అరెస్టయి నెల్సన్ మండేలా, అహ్మద్ కత్రాడాతో కలిసి ఆయన రాబెన్ ద్వీపంలో ఏళ్ల తరబడి జైలు జీవితం గడిపారు.ఇబ్రహీం మరణవార్తను దక్షిణాఫ్రికా అధికార పార్టీ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ) ప్రకటించడంతో యావత్ దేశం విషాదంలో మునిగిపోయింది.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఇస్మాయిల్ సోమవారం తన స్వగృహంలో తుదిశ్వాస విడిచినట్లు ఏఎన్సీ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితులు, సహచరులకు పార్టీ సంతాపం తెలియజేసింది.
కామ్రేడ్ ఏబీ అంటూ అభిమానులు ఆయనను ముద్దుగా పిలుచుకుంటారు.
దక్షిణాఫ్రికాలో భారతీయుల కదలికలను నిరోధించే చట్టాలను ధిక్కరించినందుకు ఇస్మాయిల్ను రెండుసార్లు అరెస్ట్ చేశారు.13 ఏళ్ల చిరుప్రాయంలోనే ఆయన దక్షిణాఫ్రికా విముక్తి పోరాటంలో చేరారు.శ్రీలంక, పాలస్తీనా, రువాండా, కొసావో, బొలీవియా, నేపాల్లలో జరిగిన వివిధ భారీ బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహాత్మా గాంధీ సత్యాగ్రహ శైలి నుంచి తాను ఎలా ప్రేరణ పొందింది ఇస్మాయిల్ వివరించేవారు.
కాగా.ఇబ్రహీం 1963లో అరెస్టయి.రాబెన్ ద్వీపంలో ఖైదు చేయబడ్డారు.
అదే సమయంలో అక్కడ జైలు శిక్ష అనుభవిస్తున్న దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమాతో ఆయనకు పరిచయం ఏర్పడింది.కారాగారవాసం తర్వాత ఇబ్రహీం ఏఎన్సీలో తన విధులను అజ్ఞాతంలో వుంటూనే నిర్వహించారు.
అయితే పొరుగునే వున్న స్వాజిలాండ్ భద్రతా అధికారులకు పట్టుబడి చిత్రహింసలకు గురయ్యారు.అనంతరం అప్పటి ప్రభుత్వం ఇస్మాయిల్ను రాబెన్ ద్వీపంలో రెండోసారి జైలుశిక్షకు పంపింది.
కారాగారంలో వున్నప్పటికీ రెండు యూనివర్సిటీలలో డిగ్రీలను సంపాదించాడు ఇస్మాయిల్.
ఉద్యమం ముగిసి దక్షిణాఫ్రికా మొదటి ప్రజాస్వామ్యబద్ధ అధ్యక్షుడిగా నెల్సన్ మండేలా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన రాజకీయ ఖైదీలను విడుదల చేశారు.వారిలో ఇస్మాయిల్ కూడా వున్నారు.అంతేకాదు మండేలా ప్రభుత్వంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా, పార్లమెంటరీ కౌన్సెలర్ సహా వివిధ హోదాలలో పనిచేశారు.
దక్షిణాఫ్రికాకు ఆయన చేసిన సేవలకు గాను కాంగ్రెస్ ఆఫ్ బిజినెస్ అండ్ ఎకనామిక్స్, ట్రాన్స్వాల్ ఇండియన్ కాంగ్రెస్ శాఖ 2018లో జీవితకాల సాఫల్య పురస్కారంతో ఇబ్రహీంను సత్కరించింది.