కరోనా వైరస్ విజృంభించిన సమయంలో కేంద్రం వైరస్ ను అదుపు చేయాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలు చేయగా రవాణా వ్యవస్థ పూర్తిస్థాయిలో స్తంభించింది.వలస కార్మికులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్న తరుణంలో సోనూ సూద్ రవాణా సదుపాయలను కల్పించి వార్తల్లో నిలిచారు.
ఆ తర్వాత కూడా సోనూ సూద్ ఎంతోమంది పేద ప్రజలకు సహాయం చేసి వార్తల్లో నిలిచారు.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సోనూ సూద్ తన వల్ల సాధ్యమైతే ఖచ్చితంగా అవతలి వ్యక్తుల సమస్యకు స్పందిస్తూ సాయం చేసి గొప్పమనస్సును చాటుకుంటున్నారు.
ప్రముఖ రాజకీయ నాయకులు, కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునే స్టార్ హీరోలు సైతం చేయలేని పనులను సోనూ సూద్ చేసి చూపిస్తున్నారు.అయితే ఎంతో మందికి సహాయం చేసినా ఏమీ ఆశించని సోనూ తాజాగా ఒక వ్యక్తిని రీచార్జ్ చేయమని కోరారు.
సోనూసూద్ ఆ వ్యక్తిని అలా కోరడానికి ప్రత్యేకమైన కారణమే ఉంది.ఒక మొబైల్ షాప్ యజమాని సోనూ లాక్ డౌన్ సమయంలో చేసిన సహాయాల వల్ల ఏర్పడిన అభిమానంతో తన మొబైల్ షాప్ కు సోనూ సూద్ పేరుతో ఫోటో వచ్చేలా ఫ్లెక్సీ తయారు చేయించాడు.
ఆ మొబైల్ స్టోర్ ద్వారా మొబైల్ రిపైర్, రీఛార్జ్, ఫోన్ విడిభాగాలు దొరుకుతాయని పేర్కొన్నాడు.సోనూ సూద్ సరదాగా అతని షాప్ ఫోటోను షేర్ చేస్తూ తన మొబైల్ కు ఉచితంగా రీఛార్జ్ చేయాలని కోరాడు.
సోనూ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.ఈ ట్వీట్ కు వేల సంఖ్యలో లైకులు, రీ ట్వీట్లు వస్తున్నాయి.
సినిమాల్లో విలన్ పాత్రల్లో ఎక్కువగా నటించిన సోనూ నిజ జీవితంలో మాత్రం హీరోగా పాపులర్ అవుతూ ఉండటం గమనార్హం.