మనల్ని ఎవరైనా విందుకు పిలిస్తే వెళ్లి సుష్టుగా భోజనం చేసి, నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకొని, హాయిగా ఇంటికి వస్తాం.కాని రాజకీయ నాయకులు ఇలా చేయలేరు.
వారి బుర్రలో ఎప్పుడూ రాజకీయాలే.ఎదుటివాడిని ఎలా మట్టి కరిపించాలనే ఆలోచనలే.
దీన్నే ‘విందు రాజకీయం’ అంటారు.సాధారణ రోజుల్లో ఇలాంటి విందు రాజకీయాలు చేశారంటే ఇదంతా మామూలే అనుకోవచ్చు.
కాని పవిత్ర రంజాన్ మాసంలో నిర్వహించే ‘ఇఫ్తార్’ విందునూ రాజకీయ వ్యూహ రచనకు ఉపయోగించుకుంటున్నారు.ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసేది రాజకీయాలు మాట్లాడుకోవడానికే.
ప్రస్తుతం ఈ పని చేస్తున్న వ్యక్తి కాంగ్రెసు అధ్యక్షురాలైన సోనియా గాంధీ.రేపు అంటే సోమవారం ఆమె తన నివాసంలో ప్రతిపక్ష నాయకులను ఇఫ్తార్ విందుకు ఆహ్వానించారు.
నాయకులు వచ్చి ఊరికే తినిపోవడానికి దీన్ని ఏర్పాటు చేయలేదు.ఈ నెల ఇరవైఒకటో తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.
కాబట్టి ఆ సమావేశాల్లో మోదీ సర్కారును ఎలా ఎదుర్కోవాలో, ఎలా ముప్పుతిప్పలు పెట్టాలో, కుంభకోణాలపై ఎలా ఇరుకున పెట్టాలో అందరూ కలిసి వ్యూహాలు రచించాలన్నమాట.భాజపాను, దాని మిత్రపక్షాలను వ్యతిరేకించే నాయకులంతా ఈ విందుకు హాజరవుతారని సోనియా అనుకుంటున్నారు.
ఎస్పి అధినేత ములాయం సింగ్, బీఎస్పీ అధినేత మాయావతి, ఎన్సీపీ అధిపతి శరద్ పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, జేడీఎస్ అధినేత దేవెగౌడ….ఇంకా అనేకమంది రాజకీయ దిగ్గజాలను సోనియా ఆహ్వానించారు.
ఈమధ్య అనేక కుంభకోణాలు బయటపడిన సంగతి తెలుసు.యూపీఏ పరిపాలనంతా కుంభకోణాలమయమని విదేశాల్లో కూడా మోడీ విమర్శించారు.
కాని ఇప్పుడు ఆయన హయాంలోనే అనేక కుంభకోణాలు జరుగుతున్నాయి.వీటిపై పార్లమెంటులో నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.
ఇందుకు సోనియా గాంధీ ఇంట్లో ప్లాన్ చేస్తున్నారు.నాయకులు విందు ఏర్పాటు చేసినా, బంద్కు పిలుపు ఇచ్చినా అంతా రాజకీయమే…!
.