మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మళ్ళీ పుట్టింది.ఆమె కొన్నేళ్లుగా మన మధ్యనే ఉంది.
ఇందిరా గాంధీని ధైర్యానికి మారు పేరుగా చెప్పుకుంటారు.ఎంతటి కష్టాన్ని అయినా ఎదుర్కొని నిలబడతారని గొప్పగా చెప్పుకుంటారు.
అలాంటి ధైర్యమున్న మహిళ మళ్ళీ పుట్టబోదని అనుకునేవారు.కాని ఆమెతో సమానమైన మహిళ మన ఎదురుగానే ఉంది.
ఆమె పేరు సోనియా గాంధీ.కాంగ్రెస్ అధ్యక్షురాలు.
తాను ఇందిరా గాంధీ కోడలినని, ఎవ్వరికీ భయపడబోనని చెప్పింది.అంటే అపర ఇందిరా గాంధీని అని చెప్పడం ఆమె ఉద్దేశం.
ఆమె ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది ? సోనియా గాంధి , ఆమె కుమారుడు రాహుల్ గాంధి, కొందరు కాంగ్రెస్ నాయకులు నేషనల్ హెరాల్డ్ పత్రిక కొనుగోలు కేసులో చిక్కుకున్నారు.కేసు విచారణ నుంచి తప్పించుకోవడానికి అవకాశం లేదు.
బీజేపీ నాయకుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామీ ఈ కేసు పెట్టారు.నేషనల్ హెరాల్డ్ కొనుగోలు వ్యవహారంలో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందని, అందులో సోనియా , రాహుల్ పాత్ర ఉందని స్వామీ ఆరోపించారు.
ఈ కేసులో ప్రత్యేక కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ వీరు దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది.ప్రత్యేక కోర్టు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
ఆ విచారణ డిసెంబర్ 19న జరుగుతుంది.ఈ సందర్భంగా సోనియా మీడియాతో మాట్లాడుతూ తాను ఇందిరా గాంధీ కోడలినని, ఎవ్వరికీ భయపడనని చెప్పారు.
ఈ కేసును రాజకీయ కక్షగా ఆమె భావిస్తున్నారు.ఈ కేసులో ప్రభుత్వ పాత్ర ఏమీ లేదని, ఇది పాత కేసని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు.