రాజకీయాలలో నే కాదు దేనిలోనైనా గెలుపు,ఓటములు సహజం అనే సంగతి అందరికీ తెలిసిందే.గెలిచినా మాదే పై చేయి,ఓడినా మాదే పై చేయి అన్నట్లు గా రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని స్థాయిలో కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం పొందినా ఈ రోజు నరేంద్ర మోడీ రెండోసారి ప్రధాని గా ప్రమాణస్వీకారం చేయనున్న కార్యక్రమానికి యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ కూడా హాజరు కానున్నట్లు తెలుస్తుంది.ఈ మేరకు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
రాజకీయాలలో శాశ్వత శత్రువు ఎవరూ ఉండరు అన్నట్లుగా పోటీ సమయంలో తప్ప మిగిలిన సమయంలో స్నేహపూర్వకంగా మెలుగుతామని తెలిపే విధంగా సోనియా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.సోనియా గాంధీ తో పాటు రాహుల్ గాంధీ,సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ లు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు సమాచారం.
మరోపక్క మోడీ ప్రమాణ స్వీకారానికి విదేశీ అధినేతలతో పాటు, పలు రాష్ట్ర ముఖ్యమంత్రులు, బీజేపీ ప్రముఖులు తదితరులు హాజరవుతున్నట్లు తెలుస్తుంది.అలానే పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల సమయంలో ప్రాణాలు కోల్పోయిన బీజేపీ కార్యకర్తల కుటుంబాలు కూడా ఈ ప్రమాణ స్వీకారమహోత్సవానికి ముఖ్య అతిధులుగా హాజరవుతున్నారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ,తృణమూల్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడం తో దాదాపు 50 మంది బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో వారందరి కుటుంబ సభ్యులను కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మోడీ ఆహ్వానించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.