వయసు పైబడిన ఓ వృద్ధురాలిని కొడుకులు రోడ్డున పడేశారు.ముగ్గురు కొడుకులు ఉన్నా కనికరం చూపకుండా బస్టాండ్ లో వదిలేసి వెళ్లారు.
ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆ బస్టాండ్ లో వర్షానికి తడుస్తూ ఆకలితో అలమటించింది.కన్నీళ్లు పెట్టుకుంటూ ఆకలి ఆకలి అంటూ బిగ్గరగా అరవసాగింది.
అది గమనించిన స్థానికులు ఆమె దగ్గరికి వెళ్లి అన్నం తినిపించి, చలి వేయకుండా దుప్పటి కప్పారు.అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు.
అక్కడికి చేరుకున్న పోలీసులు వృద్ధురాలి వివరాలను సేకరించి కొడుకు దగ్గరికి చేర్చారు.
ఓ వృద్ధురాలిని బస్టాండ్ లో వదిలేసి వెళ్లిన ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలోని గొట్టిపాడు బస్టాప్ లో చోటు చేసుకుంది.
ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన మల్లమ్మకు ముగ్గురు కూమారులు.మూడో కుమారుడు నరసరావుపేటలో టీ స్టాల్ నడిపిస్తుంటాడు.మల్లమ్మ చిన్న కొడుకు దగ్గరే ఉండేది.దీంతో పోలీసులు చిన్నకొడుకు నాగిరెడ్డి ఉంటున్న నర్సరావుపేటకు వెళ్లి విచారించగా తరచూ రోడ్డుపైకి వెళ్తుందని, ఎంత చెప్పినా వినకపోవడంతో అలా చేశానని సమాధానం ఇచ్చాడు.
ఆగ్రహించిన ఎస్ఐ మరోమారు ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించాడు.తల్లి దగ్గరికి వెళ్లిన నాగిరెడ్డి అమ్మా అని పిలవగానే మల్లమ్మ లేచి కొడుకును దగ్గరికి తీసుకుని ఏడుస్తూ ముద్దాడింది.
అనంతరం ఆమెను ప్రత్తిపాడు ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేయించాడు.