రాను రాను మనుషులు ఎలా తయారవుతున్నారో అన్న విషయం మాత్రం అర్ధం కావడం లేదు.మనుషుల మధ్య సంబంధాలను పక్కన పెడితే రక్త సంబంధాలు కూడా ఈ రోజుల్లో సరిగా కొనసాగడం లేదు అన్న విషయం అర్ధం అవుతుంది.
ఇటీవల తమిళనాడు ఇలాంటి అమానవీయ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే.తల్లి మృతి చెందడం తో దహన సంస్కారాలకు డబ్బులు లేక తల్లి మృత దేహాన్ని కుప్ప తొట్టిలో పడేసిన ఘటన గురించి విన్నాం.
అయితే తాజాగా జగిత్యాల లో మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది.తల్లి బ్రతికి ఉండగానే స్మశాన వాటికలో వదిలేసిన సుపుత్రుడు.
వివరాల్లోకి వెళితే….జగిత్యాల వీక్లీ బజార్లో చెట్పల్లి నర్సమ్మ(95) వయోభారం కారణంగా అనారోగ్యంతో బాధ పడుతోంది.
ఈమె భర్త 30ఏళ్ల క్రితమే చనిపోగా.కుమారుడు ధర్మయ్య అద్దె ఇంట్లో ఉంటూ ఆమె ఆలనా పాలనా చూసుకుంటున్నాడు.
నర్సమ్మ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైంది.అయితే తల్లి ఇంట్లోనే చనిపోతే ఇంటి యజమానితో మాట పడాల్సి వస్తుందని భయపడిన ధర్మయ్య కర్కశంగా ఆమె కన్నుమూయక ముందే శ్మశానానికి తరలించినట్లు తెలుస్తుంది.
అయితే అక్కడ పాడుబడిన ఇంట్లోని ఓ గదిలో తల్లిని ఉంచడం తో ఈ విషయం తెలుసుకున్న స్థానికులు చలించిపోవడం తో వెంటనే జగిత్యాల ప్రభుత్వాసుపత్రి ఇన్ఛార్జ్ సుదక్షిణాదేవికి సమాచారం ఇచ్చారు.దీనితో వెంటనే ఆమె అంబులెన్స్ పంపించి నర్సమ్మను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
కన్నతల్లిని శ్మశానంలో వదిలేసిన ధర్మయ్యపై స్థానికులకు కోపం వచ్చినా అతడి పరిస్థితి గురించి తెలుసుకొని జాలిపడుతున్నారు.
ఏదైనా కానీ ఇలా ఇంటి ఓనర్ కు భయపడి కన్న తల్లిని చనిపోక ముందే స్మశాన వాటికకు తరలించడం మాత్రం అమానవీయ ఘటన గా పలువురు భావిస్తున్నారు.