అత్తా, కోడలు అనగానే కామన్ గా మనందరికీ ఓ విషయం గుర్తుకు వస్తుంది.ఒకరంటే ఒకరికి పెద్దగా పడదు అనే అనుకుంటాం.
ప్రతి చిన్న విషయానికి ఇద్దరూ గొడవ పడుతుంటారనేది మనకు తెలిసిన కాన్సెప్ట్.ఇలా అత్తా కోడళ్ల వ్యవహారాల మీద అనేక సినిమాలు, సీరియళ్లు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి.
కాగా అత్తా, కోడళ్లు అంటే కేవలం గొడవ పడే వారు మాత్రమే కాదని, కలిసి మెలిసి తల్లీ, కూతుర్లలా ఉంటారని కూడా కొన్ని ఘటనలు నిరూపించాయి.రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లోనూ ఇలాంటి ఘటనలు చాలానే బయటకు వచ్చాయి.
ఇక ఇప్పుడు కూడా ఓ అత్త తన మంచి మనసుతో కోడలికి చేసిన పనికి అందరూ ఫిదా అయిపోతున్నారు.రాజస్థాన్ రాష్ట్రంలోని సికార్ ప్రాంతంలో ఉండే కమలా దేవి, దిలావర్ ల కొడుకు శుభమ్.
అయితే అతనికి సునీతతో వివాహం చేశారు.అమ్మాయి పేదింటి బిడ్డ అయినా కూడా వారు ఏమీ ఆశించకుండా పెండ్లి చేసుకున్నారు.
కానీ దురదృష్టం వెంటాడి పెండ్లైన ఆరు నెలలకే శుభమ్ మరణించాడు.దీంతో సునీత జీవితం అంధకారమైపోయింది.అందరూ ఆమెను నష్టజాతకురాలని అంటున్నా.అత్త కమలాదేవి మాత్రం అవేవీ పట్టించుకోకుండా ఆమెను చేరదీసింది.
పేదింటి అమ్మాయి కావడంతో.తన దగ్గరే ఉంచుకుని చదివించింది. ఎవరు ఎన్ని మాటలు అన్నా తన కోడలిని వెనకేసుకొచ్చింది.ఇక అత్త ఇచ్చిన ప్రొత్సాహంతో సునీత కూడా బాగా చదువుకుని జూనియర్ లెక్చరర్గా ప్రభుత్వ ఉద్యోగం సాధించింది.
దాంతో ఆమెను ముఖేష్ అనే అబ్బాయితో పెండ్లి చేసింది అత్త కమలాదేవి.అత్తా మామలే తల్లి దండ్రులుగా మారి కన్యాదానం చేశారు.ఈ వివాహ వేడుక ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.కమలాదేవి ఉదారతను అంతా మెచ్చుకుంటున్నారు.
ఇలాంటి అత్త ప్రతి కోడలికి దొరకాలంటూ కోరుకుంటున్నారు.