ఇప్పటికీ ఏపీ బిజెపి వైసిపి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఈ పరిస్థితి ఉన్నా, కేంద్రంలో ఇప్పుడిప్పుడే వైసీపీ బీజేపీ తీరుపై మండిపడుతూ, తమ ప్రాధాన్యం బిజెపి అగ్రనేతలు గుర్తించేలా వ్యవహరిస్తోంది.
బిజెపి కూడా వైసీపీ పై ఇప్పటి వరకు ఉన్న సానుకూల వైఖరి ని పక్కనపెట్టి కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది.సరిగ్గా ఇదే సమయంలో బిజెపి కి ఆగ్రహం కలిగించే విధంగా వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోవధ చట్టాన్ని రద్దు చేయాలి అంటూ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి డిమాండ్ చేయడంపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది.హిందుత్వాన్ని కించపరిచే విధంగా జగన్ సొంత పార్టీ ఎమ్మెల్యేలతో ఈ విధంగా మాట్లాడుతున్నారని, గోవధ చట్టాన్ని రద్దు చేయాలని వైసీపీ ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారని, గోమాంసం తినడాన్ని ప్రోత్సహిస్తారా అంటూ వీర్రాజు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇటువంటి వ్యాఖ్యలు చేసి భారతీయులను కించపరుస్తున్నారు అంటూ వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని లేకపోతే సీఎం జగన్ కలుగజేసుకుని ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని వీర్రాజు డిమాండ్ చేశారు.
అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, వెంటనే దీనికి జగన్ సమాధానం చెప్పాలి అంటూ వీర్రాజు డిమాండ్ చేశారు. ప్రస్తుతం బిజెపి ఆలయాల సందర్శన పేరుతో యాత్ర నిర్వహిస్తోంది.ఈ యాత్ర రెండో రోజు వినుకొండ లో పర్యటించారు.ఈ సందర్భంగా వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు.ఏపీలో దేవాలయాలను ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, జెరూసలేం, మక్కా వెళ్ళే వారికి నిధులు ఇచ్చినట్లుగా, తిరుపతి వెళ్లేందుకు హిందువులకు కూడా నిధులు మంజూరు చేయాలంటూ డిమాండ్ చేశారు.వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఇక్కడితో వదిలిపెట్టకుండా, మరింతగా ఈ వ్యవహారంపై ప్రభుత్వంపై విమర్శలు చేసి ఇరుకున పెట్టాలనే వ్యూహంతో బిజెపి ఉన్నట్లుగా కనిపిస్తోంది.