బీజేపీ, జనసేన ఏపీలో పొత్తు పెట్టుకున్నాయి.గతంతో పోలిస్తే బాగానే ఈ రెండు పార్టీలు బలం పుంజుకున్నట్టుగా కనిపిస్తున్నాయి.
అధికార పార్టీ వైసీపీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవడం, టిడిపికి రానున్న రోజుల్లో నాయకత్వ సమస్య తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో, బీజేపీ, జనసేన కి ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది.దీనికి తోడు పెద్ద ఎత్తున ఉన్న పవన్ ఫ్యాన్స్, సామాజికవర్గం అండదండలు ఎలా లెక్క చూసుకున్నా, పవన్ ఎప్పటికైనా బిజెపి సహకారంతో, ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించి, తన కల నెరవేర్చుకోవాలి అని చూస్తున్నారు.
గతంలో జరిగిన అనేక మీటింగ్ లలో పవన్ తనను సీఎం అని పిలవాలి అంటూ, అభిమానులతో పిలిపించుకుని మరి సంతోషపడ్డారు.ఇప్పుడు ఏపీలో బీజేపీ కంటే ఎక్కువగా పవన్ యాక్టివ్ గా ఉంటూ, ప్రజా సమస్యలపై స్పందిస్తూ, హడావుడి చేస్తున్నారు.
బిజెపి జనసేన కూటమికి ఎప్పటికైనా ఛాన్స్ ఉంటుంది అనే అభిప్రాయంతో ఉన్నారు.ఇదిలా ఉంటే తాజాగా బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జనసేన లో గందరగోళం సృష్టిస్తున్నాయి.
ఏపీలో బీజేపీ, జనసేన అధికారంలోకి వస్తే, బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామంటూ సోము వీర్రాజు సంచలన ప్రకటన చేశారు.రాబోయే ఎన్నికల్లో బిజెపి, జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని, చంద్రబాబు, జగన్ బీసీలను ముఖ్యమంత్రి చేయగలరా అంటూ సోము వీర్రాజు సవాల్ విసిరారు.
బిజెపి బీసీల వెనకాల నడుస్తోందని ,ఒక బీసీని ప్రధానమంత్రి చేసుకున్న పార్టీ బిజెపి అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
బీసీలను ముఖ్యమంత్రి చేయగల సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్నారు.వైసీపీ ప్రభుత్వం ప్రజలకు నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తోందని, పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయవద్దని బిజెపి నేతలను బెదిరిస్తున్నారు అంటూ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉత్తరాంధ నుంచి రాయలసీమ వరకు బిజెపిలో చేరేందుకు పెద్దఎత్తున నాయకులు పోటీ పడుతున్నారని, వైసిపి టిడిపి కి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంపీలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు అంటూ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో సీఎం అవ్వాలని కలలు కంటున్నారు.బీజేపీ సహకారంతో ఆ సరదా తీర్చుకుందామని చూస్తున్న తరుణంలో ఇప్పుడు అకస్మాత్తుగా ఏపీలో బిసి ముఖ్యమంత్రి అనే నినాదాన్ని బీజేపీ తీసుకురావడం జనసైనికులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది.
తిరుపతి లోక్ సభ అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలోనూ ఇదే విధంగా సోము వీర్రాజు ప్రకటించిన తీరు జనసేనకు ఆగ్రహం కలిగించింది.మరి తాజాగా సీఎం పదవి విషయంలో జనసేన ప్రమేయం లేకుండా, వీర్రాజు ఈ ప్రకటన చేయడంతో, ఆ పార్టీ నుంచి ఏ విధమైన రియాక్షన్ వస్తుందో చూడాలి.