జనసేన పార్టీ విషయంలో బిజెపి అనుసరిస్తున్న వైఖరి జన సైనికులకు మొదటి నుంచి ఆగ్రహం కలిగిస్తూనే ఉంది.పేరుకు ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్నా, ఎవరికి వారే సొంతంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ, ఒకరికొకరు సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు.
అలాగే ఇటీవల గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసేందుకు ప్రయత్నించింది.అభ్యర్థులను ఎంపిక చేయడంతో పాటు , కొంత మంది నామినేషన్లు సైతం వేశారు అయితే అనూహ్యంగా బిజెపి నేతల ఒత్తిడితో జనసేన తప్పుకుంది.
బిజెపికి మద్దతుగా జనసైనికులు నిలబడాలని పవన్ ప్రకటన చేశారు.గ్రేటర్ లో తాము చేసిన త్యాగానికి తిరుపతి ఉప ఎన్నికలలో తప్పకుండా తమకే అవకాశం లభిస్తుందని జనసేన భావించింది.
అయితే బిజెపి కూడా ఇక్కడ పోటీ చేసేందుకు ప్రయత్నిస్తూనే వస్తోంది.తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణం తరువాత నుంచి బిజెపి తిరుపతి కేంద్రంగా అనేక రాజకీయ వ్యూహాలు రూపొందించుకుంది.
ఇక్కడ పోటీ చేసి తీరాలని ప్రణాళికతో ముందుకు వెళుతోంది.కాకపోతే జనసేన కూడా ఇక్కడ బలంగా ఉండడం, పవన్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండటం, గతంలో తిరుపతిలో ప్రజారాజ్యం నుంచి చిరంజీవి గెలుపొందడం వంటి విషయాలను లెక్కలోకి తీసుకున్న జనసేన ఇక్కడి నుంచి పోటీ చేసి తీరాలని పట్టుదలతో ఉంటూ వస్తోంది.
ఈ ఎన్నికలలో బిజెపి , జనసేన అభ్యర్థుల లో ఎవరు పోటీ చేయాలి అనే విషయం పైన క్లారిటీ లేకపోవడంతో ఉమ్మడిగా ఒక కమిటీని కూడా నియమించుకున్నారు.ఆ కమిటీ ద్వారా రెండు పార్టీలలో ఒకరు పోటీ చేసే విధంగా ప్లాన్ చేసుకున్నారు.
కానీ ఆ కమిటీ ఇంకా ఏమి రిపోర్ట్ ఇవ్వక ముందే, బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నిన్న తిరుపతిలో నిర్వహించిన శోభాయమాన యాత్రలో సంచలన ప్రకటన చేశారు.
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలలో బిజెపి అభ్యర్థి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.జనసేన బలపరిచే బిజెపి అభ్యర్థి కి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.తిరుపతి పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి జనసేన కార్యకర్తలు కలిసి కష్టపడాలని పిలుపునిచ్చారు.
పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే తిరుపతి కి కేంద్రం మరిన్ని నిధులు మంజూరు చేస్తామని సోము వీర్రాజు ప్రకటించారు.దీనిపై జనసేన వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
తిరుపతి ఉప ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థి విషయంలో క్లారిటీ తెచ్చుకునేందుకు కమిటీని నియమించుకున్నా, ఆ కమిటీ రిపోర్టు రాకముందే బిజెపి అభ్యర్థి ఇక్కడ పోటీ చేస్తున్నారు అని బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఎలా ప్రకటిస్తారు అని వారు మండిపడుతున్నారు.
ప్రతి దశలోనూ బిజెపి జనసేన విషయంలో ఇదే విధంగా వ్యవహరిస్తోందని, గ్రేటర్ ఎన్నికల్లో చేసిన త్యాగం గుర్తించకుండా ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోము వీర్రాజు ప్రకటన పై ఇప్పుడు పవన్ ఏవిధంగా స్పందిస్తారు అనే దానిపైన బిజెపి జనసేన పార్టీ ల బంధం ఆధారపడి ఉంటుంది.