ఎప్పుడూ ఒకేలా ఉంటే తన స్పెషాలిటీ ఏముంటుంది అనుకున్నారో ఏమో కానీ, ఏపి బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం సరికొత్త రూట్ లో వెళ్తూ, వైసీపీ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.అసలు ఏపీలో బిజెపి ఉన్న ఆ పార్టీ ప్రభావం ఎక్కడ పెద్దగా కనిపించడం లేదు.
ఇప్పుడే కాదు మొదటి నుంచి ఇదే పరిస్థితి ఉంటూ వస్తోంది.కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ, సోము వీర్రాజు హయాంలోనూ బిజెపి ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది అన్న మాటే కానీ, ఆ ప్రభావాన్ని ఉపయోగించుకుని ఏపీలో బలపడేందుకు ఏమాత్రం ప్రయత్నాలు చేయకపోవడంతో, బిజెపి ఎదుగుదల అంతంత మాత్రంగానే కనిపిస్తోంది.ఇదిలా ఉంటే మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వం పై బహిరంగంగా విమర్శలు చేస్తూ వచ్చేవారు వీర్రాజు.అయితే ఇప్పుడు ఆయన ఆ రూట్ ను మార్చారు.వరసగా ఏపీలో చోటుచేసుకుంటున్న వ్యవహారాలపై జగన్ కు లేఖలు అందించే పనిలో నిమగ్నమయ్యారు.
జగన్ కు వారానికి ఒక ఉత్తరం చొప్పున వీర్రాజు రాస్తున్నారు.ఈ లేఖలు ఏపీ కి సంబంధించిన అనేక రాజకీయ అంశాలతో పాటు, జగన్ నిర్ణయాలపైన లేఖల ద్వారా వీర్రాజు ప్రశ్నిస్తున్నారు.
అలాగే ఆర్థిక శాఖ లెక్కలు తేల్చాలని గట్టిగానే లేఖలు రాస్తున్నారు.ఇక ఇటీవల కరోనా వైరస్ ప్రభావం కారణంగా వినాయక చవితి ఉత్సవాలు ,ఏపీ ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించడం పైన లేఖ ద్వారా వీర్రాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
దీంతోపాటు మత్స్యకారుల సమస్యల పైన ఒక లేఖను రాశారు.అంతేకాదు ఈ ఇరవై రోజుల వ్యవధిలో 5 లేఖలు రాశారు.
ఇలా అనేక అంశాలపై ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ లేఖలు రాయడం వల్ల ఫలితం ఆశాజనకంగా ఉంటుంది అనేది వీర్రాజు అభిప్రాయం.గతంలో చూసుకున్న ఇప్పుడు చూస్తున్నా, వివిధ సమస్యలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రభుత్వానికి , పోలీసులకు కీలకమైన అధికారులకు లేఖలు రాస్తూ ఉంటారు.
ఏపీలో చోటుచేసుకుంటున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై పోరాడేందుకు ,క్షేత్ర స్థాయిలో పోరాటం చేసే పరిస్థితి బీజేపీకి లేకపోవడంతో ఇలా లేఖల ద్వారా తన ఉనికిని చాటుకునేందుకు, బిజెపి బలోపేతం చేసేందుకు వీర్రాజు ప్రయత్నాలు చేస్తుండటం విభిన్నంగానే కనిపిస్తున్నాి , ఈ లేఖాస్త్రాలు బిజెపిని ఎంతవరకు బలోపేతం చేస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే.