సుదీర్ఘకాలం ప్రతిపక్షంలో ఉండడమే కాకుండా, పాదయాత్ర ద్వారా రాష్ట్రమంతా కాలినడకన తిరుగుతూ, ప్రజలు కష్టాలను స్వయంగా తెలుసుకుంటూ జగన్ చేపట్టిన పాదయాత్రకు అనూహ్యమైన స్పందన వచ్చింది.దాని ఫలితంగానే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 అసెంబ్లీ, 23 పార్లమెంటు స్థానాలను సునాయాసంగా గెలుచుకుని తమకు ఎదురే లేదు అన్నట్టుగా ఏపీలో పాగా వేసింది.
ఇక పూర్తి స్థాయి అధికారం ఉండడంతో జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని అడ్డు చెప్పేవారు కనిపించడం లేదు.అందుకే భారీగా సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులకు జగన్ శ్రీకారం చుట్టాడు.
అప్పట్లో ఎన్నికల్లో వైసీపీ గెలిచేందుకు తగిన సహాయ సహకారాలు అందించిన బిజెపి ఇప్పుడు మాత్రం మొహం చాటేస్తోంది.
ఏపీకి ఇవ్వాల్సిన నిధులను తొక్కి పెడుతోంది.కేంద్రం నిధులు ఇస్తుందన్న ధీమాతోనే జగన్ ఏపీ బడ్జెట్ కు మించి సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టాడు.కానీ ఇప్పుడు కేంద్ర అధికార పార్టీ బిజెపి ఈ విషయంలో వెనకడుగు వేయడంతో జగన్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.
ఇదే సమయంలో లో వైసిపి ఎంపీలను తమ వైపుకు తిప్పుకునేందుకు బిజెపి ప్రయత్నిస్తూ ఉండటం జగన్ కు నిద్రపట్టనీయడంలేదు.పార్టీ తరుపున కేంద్రంలో బలమైన వాయిస్ వినిపించి అన్ని విధాలుగా పార్టీకి ఉపయోగపడతారు అనుకున్న 23 మంది ఎంపీల్లో కొంతమంది బిజెపి వైపు చూస్తున్నారనే సంకేతాలు జగన్ కు చాలా బాధ కలిగిస్తున్నాయి.
అసలు కొంతమంది ఎంపీలు తన మాటను సైతం దిక్కరిస్తూ బిజెపితో సఖ్యతగా ఉండడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు.ఏపీలో టిడిపి నాయకులను చేర్చుకుంటూ జోష్ లో ఉన్న వైసిపి ఇప్పుడు ఎక్కడ చేజారిపోతారో అన్న ఆందోళనలో కనిపిస్తోంది.చాలామంది ఎంపీలకు వ్యాపార, ఆర్థికపరమైన లొసుగులు ఉండడంతో వారు వైసిపి కంటే బీజేపీతో కలిసి ఉంటే తమకు అన్ని విధాలా బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారు.ఇక బీజేపీ కూడా ఏపీలో బలపడాలని చూస్తోంది.
అయితే క్షేత్రస్థాయిలో బలం ఉన్న నాయకులు ఎవరు బీజేపీలు చేరడం లేదు.దీంతో ముందుగా వైసీపీ ఎంపీ లను బిజెపిలో చేర్చుకుంటే ఆ తరువాత వారి వెంట నడిచేందుకు చాలామంది నాయకులు వస్తారని బిజెపి భావిస్తోంది.
ప్రస్తుతానికి కేంద్రంలో బీజేపీకి పూర్తిస్థాయిలో మెజారిటీ ఉంది.కొత్తగా వారికి ఎంపీల అవసరమే లేదు.అయినా ఏపీలో టిడిపి, వైసిపిలను బలహీనం చేసి ఆ స్థానాన్ని బిజెపి ఆక్రమించాలని చూస్తోంది.ఇప్పటికే గోదావరి జిల్లాకు చెందిన ఓ ఎంపీతో పాటు, నెల్లూరు, ప్రకాశం జిల్లాకు చెందిన మరికొంత మంది ఎంపీలు బిజెపితో టీచ్ లోకి వెళ్లినట్టు వైసీపీ అనుమానిస్తోంది.