వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉంది.అధికారంలోకి వచ్చి ఇంకా 100 రోజులు కూడా పూర్తికాలేదు.
అయినా ఇంటా బయట అనేక విమర్శలు ఎదుర్కుంటోంది.ప్రధానంగా ఎన్నికల ముందు జగన్ కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన బీజేపీ ఇప్పుడు వైసీపీ మీద గుర్రుగా ఉంది.
అంతే కాదు చాలా మంది వైసీపీ నాయకులే పార్టీ మీద గుర్రుగా ఉన్నారు.ఎంతో కాలం ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు అధికారంలోకి వస్తే ఆ ఆనందం ఎంతో కాలం ఉండకుండా చేస్తున్నారంటూ ఆగ్రంగా ఉన్నారు.
దీనంతటికి కారణం ఏంటి అనే విషయం పరిశీలిస్తే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమర్దవంతంగా సలహాలు, సూచనలు అందించిన ఆ పార్టీ ట్రబుల్ షూటర్స్ ఇప్పుడు మౌనంగా ఉండడమే కారణమని తెలుస్తోంది.పార్టీ అధినేత జగన్ అమెరికా పర్యటనలో ఉండగా పార్టీ సీనియర్ లు ఎవరికి వారు ఇష్టానుసారంగా ప్రకటనలు చేస్తూ అనవసర గందరగోళానికి కారణం అయ్యారనే విమర్శలు ఇప్పుడు పెద్ద ఎత్తున వస్తున్నాయి.
ఏపీ సీఎం జగన్ అమెరికా పర్యటనలో ఉండగా ఏపీలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వరదలు, పోలవరంపై హైకోర్టు నిర్ణయాలు, అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు, దీనిపై పీఎంవో సీరియస్గా స్పందించడం, ఇలా అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఏపీ రాజకీయాలు హీటెక్కాయి.ప్రభుత్వ రథసారథి, తమ పార్టీ అధినేత దేశంలో లేని సమయంలో, పార్టీకి, ప్రభుత్వానికి ఎటువంటి పరువు నష్టం రాకుండా, చూసుకోవాల్సిన సీనియర్ నాయకులు ఎవరికి వారు తమ ఇష్టం వచ్చినట్టుగా , మాటల తూటాలు పేల్చడంతో ఇప్పుడు వాటన్నికి జగన్ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ్నికి సంబందించిన వైపల్యాలన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైసీపీ సీనియర్లు ముందు వరుసలో ఉండేవారు.
జగన్ కోర్ టీమ్ లో ఉన్న విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మిగిలిన సీనియర్ నేతలు తమదైన శైలిలో వ్యూహాలు రచించేవారు.
జగన్ నిత్యం ప్రజల్లో ఉండడడం, పాదయాత్ర సమయంలోనూ తీరికలేని సమయంలో జగన్ కోర్ టీమ్ నాయకులే తెర వెనుక రాజకీయం నడిపించేవారు.వీరి వ్యూహాలతో వైసీపీకి మంచి మైలేజ్ వచ్చేది.వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీనియర్ నాయకులకు ప్రభుత్వ పదవులు వచ్చాయి.
విజయసాయిరెడ్డి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఎంపికయ్యారు.
ఇక సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు.ఇక మిగిలిన సీనియర్ నాయకులు కొంతమంది మంత్రివర్గంలో చోటు దక్కించుకుంటే మరికొందరు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.
దీంతో ఎమ్మెల్యేలు నియోజక వర్గాలకు, మంత్రులు ఆయా శాఖలకే పరిమితం అయిపోయారు.మరోవైపు చూస్తే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మాత్రం విఫలం అవుతున్నారు.
పార్టీ సీనియర్లు ఇతర బాధ్యతల్లో బిజీగా ఉంటే మిగిలిన నేతలు మనకెందుకు వచ్చిందిలే అన్నట్టుగా వదిలేస్తున్నారు.సీనియర్ నాయకులు కొంతమంది తాము పార్టీ కోసం ఎంత కష్టపడినా క్యాబినెట్లో కానీ, నామినేటెడ్ పదవుల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
మొత్తంగా చూస్తే అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టుగా సీనియర్ లు తమ నోటికి పనిచెబుతుండడం విమర్శలకు తావిస్తోంది.