ఇటీవలికాలంలో అమెరికాలో పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని ఉన్మాదులు కాల్పులకు తెగబడుతున్నారు.అలాగే విద్యార్ధుల్లో కొందరు కూడా తమ సహచరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు.
వరుస ఘటనల నేపథ్యంలో తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు.ఈ భయాలను క్యాష్ చేసుకునేలా కొందరు ఫేక్ వార్తలు పుట్టిస్తున్నారు.
తాజాగా సోషల్ మీడియాలో కాల్పులకు సంబంధించి రూమర్స్ చక్కర్లు కొట్టడంతో అమెరికాలోని పలు రాష్ట్రాల్లో పాఠశాలల నిర్వాహకులు ఉలిక్కిపడ్డారు.దీంతో స్కూళ్లను మూసివేయడంతో పాటు భద్రతను కట్టుదిట్టం చేశారు.
టెక్సాస్, మిన్నెసోటా, మిస్సౌరీ, మోంటానా, సెంట్రల్ న్యూయార్క్, కనెక్టికట్ రాష్ట్రాల్లోని కొన్ని పాఠశాలలను మూసివేశారు.ఇటీవల మిచిగాన్ స్కూల్లో జరిగిన కాల్పుల ఘటనే ఇంతటి భయాందోళనలకు కారణంగా తెలుస్తోంది.
అయితే అమెరికాలోని నాలుగు పెద్ద పాఠశాల జిల్లాలైన చికాగో, మయామి, న్యూయార్క్ సిటీ, లాస్ ఏంజిల్స్లో ఈ పుకార్లను మాత్రం పట్టించుకోకుండా స్కూళ్లు తెరిచే వుండటం విశేషం.అయినప్పటికీ ముందుజాగ్రత్త చర్యగా ఈ రూమర్స్ని తీవ్రంగా పరిగణనలోనికి తీసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.బాల్టిమోర్, ఫిలడెల్ఫియా, సీటెల్ స్కూల్ డిస్ట్రిక్ట్స్లోనూ ఇదే తరహాలో వార్తలు కలకలం రేపాయి.అటు హ్యూస్టన్ సమీపంలోని అనేక పాఠశాలలు తమ విద్యార్ధులను బ్యాగ్లు ఇంటి దగ్గర విడిచి రావాల్సిందిగా ఆదేశించాయి.
అయితే ఇంతటి కలకలం రేపిన ఈ హెచ్చరికలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియరాలేదు.
స్థానిక వార్తా సంస్థల కథనం ప్రకారం.తమ సైట్లో ఈ తరహా వార్తలు కనుగొనలేదని ఈ విషయంలో అధికారులకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్ ఒక ప్రకటనలో తెలిపింది.సెర్చింగ్ బార్లో ఈ తరహా పోస్ట్ల గురించి యూజర్లు వెతికారని.
అయితే ఎవరూ నేరుగా వాటిని పోస్ట్ చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని టిక్టాక్ తెలిపింది.అటు ఈ వ్యవహారంపై మరో సోషల్ మీడియా దిగ్గజం స్నాప్ చాట్ సైతం స్పందించింది.
తమ ఫ్లాట్ఫామ్లో వచ్చే ఎలాంటి బెదిరింపు పోస్టులనైనా నిశితంగా పర్యవేక్షిస్తామని ఒక ఈమెయిల్లో తెలిపింది.ఫేస్బుక్ ప్రతినిధి సైతం దీనిపై స్పందించారు.
కాగా.స్నాప్చాట్, టిక్టాక్లలో అక్టోబర్ నెలలో కూడా ఇదే తరహా బెదిరింపు పోస్ట్లు హల్చల్ చేయడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.