తెలుగుదేశం పార్టీలో టికెట్ల కేటాయింపులు ఒక వైపు జరిగిపోతున్నాయి.బలమైన అభ్యర్థులను రంగంలోకి దించి మరోసారి అధికారం దక్కించుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహరచన చేస్తూ బలహీనమైన సిట్టింగ్ ఎమ్మెల్యేలను అవసరం అయితే తప్పించాలని చూస్తున్నారు.
బాబు ఆలోచనను బట్టి చూస్తే టీడీపీలో దాదాపు 30 మంది సిట్టింగ్ లకు టికెట్లు దక్కే అవకాశం కనిపించడంలేదు.వీరిలో సుమారు 16 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తోంది.
టికెట్ దక్కే అవకాశం లేదని భావిస్తున్న వారు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే పక్క పార్టీల్లో తమకు టికెట్ దక్కుతుందా అని ఆరాతీస్తూ అటు నుంచి హామీ కనుక వస్తే జంప్ చేయాలనీ చూస్తున్నారు.మరికొందరు మాత్రం అమరావతిలో బలప్రదర్శనకు దిగేశారు.
దాంతో ఆశావహులు, టికెట్లలో కోతపడే వారితో చంద్రబాబు క్యాంపు కార్యాలయం దగ్గర గందరగోళం నెలకొంది
గత ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు.వారందిరికీ కొన్ని తాయిలాలతో పాటు టికెట్లు ఇస్తానని హామీ ఇచ్చి మరీ పార్టీలోకి లాక్కున్నారు.
తీరా ఎన్నికలు దగ్గరకు వచ్చే సమయానికి సర్వేల్లో మీ పనితీరు సక్రమంగా లేదని చెబుతూ సుమారుగా 16 మందికి టికెట్లు ఇవ్వటంలేదని చెప్పేస్తుండడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.ఇక టికెట్ దక్కే అవకాశం లేదని భావిస్తున్న టిడిపి సిట్టింగులలో పరిస్ధితి మాత్రం మరో రకంగా ఉంది.
అక్కడ గ్రూపు తగాదాలు మితిమీరడంతో పార్టీ గెలుపు అవకాశాలను ప్రభావితం చేసేటట్టుగా ఉన్నట్టు తేలడంతో బాబు సీరియస్ గా ఈ విషయంపై దృష్టిపెట్టాడు.
అందుకే ఆ సిట్టింగ్ స్థానాల్లో మార్పు తప్పదని ప్రకటిస్తున్నాడు.ఈ విధంగా టికెట్ దక్కే అవకాశం లేని నాయకుల పేర్లను పరిగణలోకి తీసుకుంటే కొవ్వూరులో మంత్రి జవహర్, పాయకరావుపేటలో వంగలపూడి అనిత, విజయనగరం అర్బన్ నుండి మీసాల గీత, పార్వతీపురంలో బొబ్బిలి చిరంజీవులు, అమలాపురంలో అయినాబత్తుల ఆనందరావు, నిడదవోలు బూరుగుపల్లి శేషారావు, గోపాలపురంలో ముప్పిడి వెంకటేశ్వరరావు, చింతలపూడిలో పీతల సుజాత, తాడికొండలో శ్రవణకుమార్, పోలవరంలో మొడియం శ్రీనివాసరావు తదితర పేర్లు బాగా ప్రచారంలోకి వస్తున్నాయి.వీరందరిని తప్పించే అవకాశం ఉన్నట్టు తేలడంతో ఆయా నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులు ఎవరా అనే ఉత్కంఠ నెలకొంది.