ఎక్కడైనా అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలలోకి వలసలు ఉండవు.అందరూ అధికార పార్టీలో చేరి , తమకు తమ రాజకీయ జీవితానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే క్రమంలోనే అధికారపార్టీ లోకి వెళుతూ ఉంటారు.
ఇది సహజంగా ఎక్కడైనా జరుగుతూ ఉండే విధానమే.అయితే తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ లో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది.
ఇప్పుడు ఆ పార్టీ నాయకులు, కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వెళ్లేందుకు సిద్ధం గా ఉన్నారనే సమాచారం వైరల్ గా మారింది.గతంలో కాంగ్రెస్ తదితర పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరిన చాలా మంది నేతలు టీఆర్ఎస్ లో సరైన రాజకీయ ప్రాధాన్యం దక్కడం లేదని, తమను చేర్చుకున్న దగ్గర నుంచి పట్టించుకోనట్టు వ్యవహరిస్తున్నారని, అధికార పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉంటూ వస్తున్నారు.
అయితే సరైన రాజకీయ ప్రత్యామ్నాయం లేకపోవడంతో వారంతా సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి రావడం తదితర కారణాలతో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని చాలామంది నాయకుల్లో కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారట.అధికార పార్టీ నుంచి ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించాలని రేవంత్ అభిప్రాయపడుతున్నారట.హుజురాబాద్ ఉప ఎన్నికలకు ముందే ఈ ఆపరేషన్ ఆకర్ష్ ను నిర్వహించడం ద్వారా, ఫలితాలను కూడా తారుమారు చేయవచ్చనే అభిప్రాయంలో రేవంత్ ఈ ఆపరేషన్ కు శ్రీకారం చుట్టుబోతున్నట్లు సమాచారం.ఇప్పటికే కొంత మంది తో రహస్యంగా సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది.
వీరే కాకుండా గతంలో టిఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన నాయకులకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో, వారిని తమ వైపు తీసుకు వచ్చే విధంగా రేవంత్ సరికొత్త ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది.ఈ మేరకు కొంత మంది ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ వైపు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా గతంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు ఇప్పుడు మళ్లీ సొంత గూటికి వచ్చేందుకు సిద్ధం అన్నట్లుగా వర్తమానం పంపినట్లు సమాచారం.ముఖ్యంగా ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది అనే విషయాన్ని గుర్తించిన కొంతమంది ఎమ్మెల్యేలు, కీలక నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ వైపు వచ్చేందుకు అడుగులు వేస్తుండడం తో, ఆ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుండగా, టీఆర్ఎస్ ఈ పరిణామాలపై ఆరా తీస్తోంది.ఎవరెవరు టిఆర్ఎస్ లో చేరేందుకు సిద్దంగా ఉన్నారనే విషయంపై ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.