ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో తాత్కాలికంగా పాఠశాలలు మూసివేసిన సంగతి అందరికీ తెలిసిందే.కాగా ప్రస్తుతం రోజురోజుకి కరోనా దేశంలో ఉగ్ర రూపం దాల్చుతూ తీవ్ర కలవర పెడుతోంది.
దీంతో కొన్ని ప్రైవేట్ పాఠశాల యాజమాన్య సంస్థలు తమ విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా పాఠాలు చెప్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో
దూరదర్శన్ చానల్
లో పాఠాలు విద్యార్థులకు చెబుతున్నారు.
అయితే ప్రస్తుతం ఆన్ లైన్ క్లాసులకు విద్యార్థులు మొగ్గు చూపుతుండటంతో స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ మరియు ల్యాప్ టాప్ వంటి వాటికి మంచి డిమాండ్ పెరిగింది.
దీంతో కొందరు కేటుగాళ్లు ఈ విషయాన్నీ క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో అతి తక్కువ ధరలకే ల్యాప్ టాప్ లను విక్రయిస్తున్నామంటూ ప్రకటనలు చేస్తూ విద్యార్థులను బోల్తా కొట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.తాజాగా కేవలం 3500 రూపాయలకే ల్యాప్ టాప్ వస్తుందంటూ, అంతేకాకుండా ఇది ప్రభుత్వం యొక్క కొత్త స్కీమ్ అని అంటూ మభ్యపెట్టి ఆన్ లైన్ లో అక్రమంగా డబ్బులు సంపాదించేందుకు వల పన్నుతున్నారు.
దీంతో తాజాగా ఈ విషయంపై పీఐబీ ఇన్వెస్టిగేషన్ అధికారులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు.
ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రస్తుతం విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులు కోసం సబ్సిడీ లో ఎలాంటి ల్యాప్ టాప్ లను అందించడం లేదని స్పష్టం చేశారు.
అంతేగాక ఇలాంటి ప్రకటనలు వచ్చినప్పుడు విద్యార్థులు కొంతమేర అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్య కాలంలో గూగుల్ ప్రకటనల్లో ఊరు, పేరు లేనటువంటి కొన్ని సంస్థలు తక్కువ ధరలకే ఉత్పత్తులను అందిస్తున్నామంటూ ప్రకటిస్తున్నాయని, కాబట్టి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న సంస్థలను గుర్తించి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు.