ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఒకప్పుడు రాజకీయ వైరం తీవ్ర స్థాయిలో ఉండేది.అయితే ఇప్పుడు ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడడం, ఎన్నికల ముందు నుంచి వైసీపీ అధినేత జగన్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధ్య స్నేహం చిగురించడంతో రెండు రాష్ట్రాల మధ్య ఈ స్నేహ వాతావరణం ఏర్పడింది.
అంతే కాదు ఒక రాష్ట్ర ప్రయోజనాల కోసం మరో రాష్ట్రం సహకరించుకుంటూ ముందుకు వెళ్తున్నాయి.ముఖ్యంగా కేసీఆర్ ఏపీ కి సంబందించిన విషయాల్లో తరచూ కలుగజేసుకుని చేస్తున్న వ్యాఖ్యలపై రాజకీయ దుమారం కూడా అదే స్థాయిలో చెలరేగుతోంది.
కొద్ది రోజుల క్రితం ఏపీ రాజధాని అమరావతి గురించి మాట్లాడుతూ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయడం దండగా అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు.అంతేకాదు అసలు చంద్రబాబుకు అమరావతి నిర్మాణం చేయొద్దని ఎంతగానో చెప్పానని అయినా అయన వినిపించుకోలేదు అంటూ కెసిఆర్ చెప్పుకొచ్చారు.
ఒక వైపు చూస్తే అమరావతిని వైసీపీ ప్రభుత్వం ఏపీ రాజధానిగా కొనసాగిస్తుందా లేదా అనే అంశం చర్చనీయాంశంగా మారింది.ఈ నేపథ్యంలో కేసీఆర్ అమరావతి గురించి మాట్లాడటం రాజకీయంగా దుమారం రేపుతోంది.తాజాగా కేసీఆర్ మాట్లాడిన మాటలే ఆయన్ను ఇబ్బందుల్లో పడేసేలా కనిపిస్తున్నాయి.గతంలో ఓ సందర్భంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు.ఏపీ రాజధాని అమరావతిని అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ రూ.100 కోట్లు ఇవ్వాలనుకుంటున్నారని కేటీఆర్ చెప్పారు.అయితే అమరావతి భూమిపూజ చేసిన రోజే తన నిర్ణయాన్ని ప్రకటించాలనుకున్నారని తెలిపారు.కాగా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయన వెనక్కు తగ్గారని కేటీఆరే స్వయంగా మీడియాతో చెప్పుకొచ్చారు.
ఇప్పుడు ఆ వ్యాఖ్యలనే సోషల్ మీడియా యూజర్స్ గుర్తు చేస్తున్నారు.
అసలు అమరావతిని రాజధానిగా డెవలప్ చేయడం దండగ అని అప్పుడు చెప్పినట్టు ఇప్పుడు చెబుతున్న కేసీఆర్ మరి వంద కోట్లను ఇస్తానని గతం లో ఎలా చెప్పారంటూ ప్రశ్నిస్తున్నారు.కేసీఆర్ ఇప్పుడు చెప్పింది అబద్దమా ? లేక కేటీఆర్ అప్పుడు చెప్పింది అబద్దమా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.అసలు ఇప్పుడు ఎవరి మాటలు నమ్మాలి, అసలు అమరావతి గురించి కేసీఆర్ మాట్లాడటమేంటి దీనిపై సీఎం జగన్ ఎందుకు స్పందించడంలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు.
కేసీఆర్ చెప్పిన మాటను అప్పట్లో చంద్రబాబు పాటించకపోయినా, ఇప్పుడు జగన్ పాటిస్తున్నారేమో అన్న సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.ఏది ఏమైనా ఏపీ విషయంలో కేసీఆర్ ఎక్కువగా జోక్యం చేసుకోవడం మాత్రం విమర్శలపాలవుతోంది.