అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.జగన్ కు ఎక్కడలేని పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చాయి.
అసలు ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో పనిచేసిన ముఖ్యమంత్రులు ఎవరికీ ఈ స్థాయిలో ఇంత స్వల్పకాలంలో ఇన్ని సంక్షేమ పథకాలను అమలు చేయలేదు.అలాగే ఇన్ని సంచలన నిర్ణయాలు తీసుకోలేకపోయారు.
కానీ జగన్ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన సమయంలోనే ఇటువంటి నిర్ణయాలు తీసుకుని తన సత్తా చాటుకున్నాడు.దేశవ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకున్నాడు.
దీనికి తగ్గట్టుగానే ఏపీలో తన మార్క్ కనిపించేలా, అన్ని రాష్ట్రాల కంటే ఏపీని ముందంజలో ఉంచాలని, పేదల ప్రభుత్వం గా చెప్పుకోవాలని జగన్ ఎన్నో ఊహించుకుంటున్నారు.
దానికి తగ్గట్టుగానే ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
జగన్ ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకున్నా, వాటిపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేయడం, కోర్టులకు వెళ్లి స్టే తీసుకురావడం, అడుగడుగున జగన్ నిర్ణయాలకు అడ్డం పడుతుండడం ఇటువంటి పరిణామాలు జగన్ కు ఇబ్బంది కలిగిస్తున్నాయి. శాసన మండలి రద్దు, దిశా చట్టం, పోలవరం ప్రాజెక్ట్, నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ , మూడు రాజధానులు ఏర్పాటు, ఇలా చెప్పుకుంటూ వెళితే జగన్ తీసుకున్న నిర్ణయాలు అన్నీ ఇన్నీ కావు.
అయితే ఇందులో ఎక్కువ శాతం పెండింగ్ లో పడిపోయి అమల్లోకి రాలేదు.
వీటన్నింటిపై కోర్టుల్లో పిటిషన్ లు పెండింగ్ లో ఉండడమే.అప్పట్లో ఈ కేసుల వ్యవహారాలు తేలే పని కాదని, జగన్ కు అర్థమైపోయింది.ఈ నేపథ్యంలో ప్రజల్లో ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినకుండా, తాము అభివృద్ధికి పాటు పడుతుంటే, ప్రతిపక్షాలు వాటిని ఏవిధంగా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారో నిరూపించుకునేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ప్రజల్లోకి వెళ్లి, అన్ని విషయాలపైన ప్రజలకు వివరణ ఇవ్వాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.దీనిద్వారా ప్రభుత్వం పై ఎటువంటి వ్యతిరేకత పెరగదని, ఈ సమయంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం రాష్ట్ర అభివృద్ధి అడ్డుకుంటుందనే అభిప్రాయం ప్రజల్లో కలిగి ఆ పార్టీపై ద్వేషం పెంచుకుంటారు అనే ఆలోచనలో జగన్ ఉన్నట్టు కనిపిస్తున్నారు.