ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఉద్యోగాలు, పనులు, ఇతర కారణాల వల్ల ఇతరప్రాంతాలకి వెళ్లి నిలిచిపోయిన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.దీంతో తాజాగా లాక్ డౌన్ లో సడలింపులు చేపట్టడంతో వలస కార్మికులు, ఉద్యోగస్తులు, తమ ఇళ్లకు చేరుకునేందుకు ప్రైవేటు వాహనాల ద్వారా పయనమవుతున్నారు.
ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటువంటి ప్రజలకి ఈ పాస్ అనుమతులు కచ్చితంగా ఉండాలని ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
దీంతో కొందరు ప్రజలు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఈ పాస్ అనుమతులు లేకుండా రాష్ట్రంలోకి ఎంటర్ అవడానికి ప్రయత్నిస్తుండగా చెక్ పోస్టుల వద్ద పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
మరికొందరైతే ఏకంగా చెక్ పోస్ట్ దరిదాపుల వరకు కార్లలో ప్రయాణిస్తూ చెక్ పోస్ట్ వద్దకు రాగానే దిగి నడుచుకుంటూ చెక్ పోస్ట్ దాటే ప్రయత్నం చేశారు.అలాంటి వారిని కూడా పోలీసులు గుర్తించి అటు నుంచి అటే వెనక్కి పంపించేశారు.
అంతేకాక రాష్ట్రంలోకి రావాలంటే కచ్చితంగా ఈ పాస్ కలిగి ఉండాలని లేకపోతే అనుమతించేది లేదని మరోమారు ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు.అంతేగాక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న టువంటి కరోనా వైరస్ కేసులను దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయం తీసుకున్నామని కాబట్టి ప్రజలు ప్రభుత్వ అధికారులకు సహకరించాలని కోరుతున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నమోదయినటువంటి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గణాంకాలను పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 16 వేల పైచిలుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇందులో 198 మంది మృత్యు వాత పడ్డారు.అయితే ఇప్పటి వరకు అత్యధికంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రాష్ట్రంలోనే విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లా అయినటువంటి అనంతపురం రాష్ట్రంలో నమోదయ్యాయి.
దీంతో ప్రభుత్వ అధికారులు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.