ఫిబ్రవరి సగం అయ్యింది, మార్చిలో సినిమాల విడుదల అంతంత మాత్రమే, ఇక ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సినిమాలన్నీ కూడా ఏప్రిల్ నుండి విడుదలకు సిద్దం అవుతున్నాయి.ఏప్రిల్ ఆరంభంలోనే ‘మజిలి’, ఆ తర్వాత వారం ‘చిత్రలహరి’ చిత్రాలను విడుదల చేసేందుకు కొన్ని నెలల క్రితమే డేట్లు ఫిక్స్ అయ్యాయి.
ఆ రెండు చిత్రాలు సమ్మర్ను ప్రారంభించబోతున్నాయి అనుకుంటున్న సమయంలో ఈ రెంటికి తోడు మరో రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాయి.
మజిలీ మరియు చిత్రలహరి చిత్రాలతో పాటు అవే తేదీల్లో ‘జెర్సీ’ మరియు ‘కాంచన 3’ చిత్రాలు విడుదల కాబోతున్నాయి.ఈరెండు చిత్రాలు మొదట ఏప్రిల్ 19న విడుదల చేయాలని భావించారు.అయితే ఏప్రిల్ 25న మహేష్ బాబు మహర్షి చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది.
ఆ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.సినిమాపై అంచనాలు పతాక స్థాయిలో ఉన్నాయి.దాంతో భారీ ఎత్తున మహర్షిని విడుదల చేయాలని భావిస్తున్నారు.మహర్షి కోసం ఇప్పటికే దాదాపుగా 80 శాతం థియేటర్లను బ్లాక్ చేశారు.
మహర్షి సినిమా కోసం అంతకు ముందు వారం విడుదలయ్యే సినిమాలను తొలగించే అవకాశం ఉంది.అందుకే ఏప్రిల్ 19న విడుదల అయితే వారం రోజుల్లోనే బిజినెస్ క్లోజ్ అవుతుందనే ఉద్దేశ్యంతో జెర్సీ మరియు కాంచన 3 చిత్రాల నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.అయితే అప్పటికే ఫిక్స్ అయిన మజిలీ మరియు చిత్రలహరి చిత్రాల విషయంలో ఇబ్బంది మొదలు కానుంది.
మొత్తానికి ఏప్రిల్ మొదటి రెండు వారాల్లో బాక్సాఫీస్ వద్ద సందడి కనిపించబోతుంది.ఈ నాలుగు సినిమాలతో పాటు మరో రెండు మూడు చిన్న చితకా సినిమాలు కూడా వచ్చే అవకాశం ఉంది.మరి ఈ వార్లో విజేత ఎవరో చూడాలి.