బ్రిటన్లో కొత్త రకం వైరస్ వెలుగు చూడటంతో అది తమ దాకా రాకుండా ఆయా దేశాలు జాగ్రత్త పడుతున్నాయి.ఇప్పటికే పలు దేశాలు యూకే నుంచి విమానాలు రానివ్వకుండా, యూకేకు విమానాలు నడపకుండా నిషేధం విధించాయి.
ఈ పరిస్ధితుల్లో మనదేశంలోకి ఈ ప్రమాదకర వైరస్ ప్రవేశించింది.లండన్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిరిండియా విమానంలో ఆరుగురికి కరోనా పాజిటివ్గా తేలింది.సోమవారం రాత్రి 11.30 గంటలకు ఈ విమానం న్యూఢిల్లీకి చేరుకుంది.ఇక్కడ నిర్వహించిన పరీక్షల్లో ఐదుగురికి ఎయిర్పోర్ట్లోనే పాజిటివ్గా తేలింది.మరో తమిళనాడుకు చెందిన వ్యక్తికి కరోనా నిర్థారణ అయ్యింది.
దీంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది.ప్రస్తుతం ఆ వ్యక్తిని క్వారంటైన్లో వుంచారు.
కొత్త వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కాంటాక్ట్ ట్రేసింగ్ను ప్రారంభించారు.సదరు ప్రయాణికుడిలో బయటపడిన వైరస్ కొత్త రకానిదా.? కాదా.? అనే విషయాన్ని నిర్థారించేందుకు శాంపిల్స్ను పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు.మరోవైపు ఢిల్లీ, చెన్నైలలో బ్రిటన్ వైరస్ వెలుగు చూడటంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.అటు కొత్త రకం వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ వైద్య శాఖ అలర్ట్ అయ్యింది.
గడిచిన వారం రోజులుగా విదేశాల నుంచి వచ్చిన వారిని ముఖ్యంగా బ్రిటన్ నుంచి వచ్చిన వారిని ట్రాక్ చేసే పనిలో నిమగ్నమైంది.అలాంటి ప్రయాణికులను గుర్తించి పరీక్షలు నిర్వహించనుంది.అటు శంషాబాద్ ఎయిర్పోర్టులోనూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది.రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (RGIA)లో కరోనా సర్వేలెన్స్ చేస్తూ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు అక్కడే ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించనున్నారు.
పాజిటివ్ వచ్చిన వారిని, కొవిడ్-19 లక్షణాలున్న వారిని గుర్తించి నేరుగా హాస్పిటళ్లకు తరలించి చికిత్స అందించనున్నారు.నెగిటివ్ వచ్చినా.వారం రోజులు క్వారంటైన్లో ఉండాల్సిందేనని ప్రయాణికులకు సూచిస్తున్నారు.