ప్రస్తుతం కరోనా విపరీతంగా వ్యాపిస్తూ ఉండటంతో డాక్టర్లు సైనికులుగా మారి యుద్ధం చేస్తున్నారు.ఇంతకాలం విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటారు, ప్రైవేట్ హాస్పిటల్స్ లో డబ్బులు గుంజుతారు అంటూ ప్రజలతో తిట్టించుకున్న వైద్యులు నిరంతరం విశ్రాంతి లేకుండా కరోనా రోగులకి సేవలు అందించడంతో పాటు హాస్పిటల్స్ లో వచ్చే పేషెంట్స్ కి టెస్ట్ లు చేస్తూ ఖాళీ లేకుండా ఉన్నారు.
ఇక ప్రభుత్వం కాంట్రాక్ట్ వైద్యులని కూడా కరోనా సేవలకి వినియోగించుకుంటుంది, వైద్యులు అందరిని ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చి వారితో పని చేయించుకుంటుంది.చాలా మంది డాక్టర్లు ప్రాణాలకి తెగించి ఈ కరోనాతో యుద్ధం చేస్తున్నారు.
అయితే తాజాగా ఆరుగురు డాక్టర్లు కరోనాకి భయపడి రాజీనామా చేశారు.
కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
కరోనా వ్యాధి భయంతో తాము విధులు నిర్వహించబోమని ఏకంగా ఆరుగురు వైద్యులు రాజీనామా చేశారు.తాము విధులు నిర్వహించడానికి తమ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోవడం లేదంటూ శనివారం రాజీనామా లేఖలను ఆస్పత్రి సూపరింటెండెంట్కు అందజేశారు.
వీరంతా కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు.ప్రభుత్వ ఆస్పత్రి ఓపీకి రోగుల తాకిడి ఎక్కువవుతోంది.
రోజూ 300 పైగా రోగులు వస్తున్నారు.దీనికి తోడు కరోనా ఐసోలేషన్ వార్డుల్లో 24 గంటల పాటు విధులు నిర్వహిస్తుండటంతో ఒత్తిడికి గురవుతున్నామని వారు తెలిపారు.
అలాగే ఓపీకి కరోనా లక్షణాలు ఉన్నవారు కూడా వస్తున్నారని, వారు గుంపులుగా రావడంతో ఎవరికి కరోనా ఉందో తెలుసుకోవడం ఓపీలో కష్టంగా ఉంటుందని దీంతో భయం వల్ల కూడా విధులు చేయలేకపోతున్నామని వాపోయారు.ఇదిలా ఉండగా జిల్లా కలెక్టర్తో పాటు డీఎంహెచ్వో, డీసీహెచ్ఎస్లు రాజీనామా చేసిన వైద్యులతో మాట్లాడారు.
విధులు నిర్వహించకపోతే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రభుత్వ నిబంధనలకి లోబడి పని చేయాల్సిందే అని అధికారులు వారికి తెలియజేశారు.