గత కొంత కాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ మాజీ స్పీకర్,దివంగత టీడీపీ నేత కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం ఎట్టకేలకు మంగళవారం కోర్టు ఎదుట లొంగిపోయారు.కబ్జాలు,బెదిరింపులు,కే ట్యాక్స్ పేరుతో వసూళ్లు వంటి పలు అక్రమాలను పాల్పడినట్లు శివరాం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలో ఆయనపై ఐదు కేసులు కూడా నమోదయ్యాయి.అయితే ఈ ఐదు కేసుల విషయంలో తనకు బెయిల్ ఇవ్వాలని హైకోర్టు ను ఆశ్రయించగా దానికి కోర్టు ఆయనను లొంగిపోవాలని సూచించడం తో మంగళవారం నరసరావుపేట ఫస్ట్ మున్సీఫ్ మేజిస్ట్రేట్ కోర్టు లో లొంగిపోయినట్లు తెలుస్తుంది.
శివరాం తన తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని అనేక అక్రమాలకు పాల్పడినట్లు వివిధ పోలీస్ స్టేషన్ లలో బాధితులు ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో ఆయనపై పలు కేసులు నమోదు కావడం తో పోలీసులకు లొంగిపోకుండా కోర్టు ల చుట్టూ తిరుగుతూ తప్పించుకుంటూ వస్తున్నారు.
ఇటీవల కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో కూడా శివరాం విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తుంది.
గుంటూరు జిల్లా లో కే ట్యాక్స్ పేరిట భారీ స్థాయిలో అక్రమంగా సొమ్ములు వసూల్ చేశారని,పెద్ద ఎత్తున సెటిల్మెంట్ లు జరిపారని,అలానే ఏపీ అసెంబ్లీకి చెందిన ఫర్నీచర్ను శివరాం తన షోరూమ్లో ఉంచారు అంటూ శివరాం ఎన్నో ఆరోపణలు ఎదురుకొంటున్న విషయం తెలిసిందే.అయితే టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం బయటకు రాని బాధితులు వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కక్కొరు బయటకు వచ్చి శివరాం కు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం మొదలు పెట్టారు.దీనితో శివరాం పై పలు సెక్షన్ ల కింద పలు కేసులు నమోదు కావడం తో కోర్టు విచారణ ను ఎదుర్కొంటున్నారు.