సమాజంలో అభివృద్ధి అనేది నాణ్యతాయుతమైన విద్యపైననే ఆధారపడి ఉంటుంది.అందుకే ప్రపంచంలో అభివృద్ధిచెందిన దేశాలలో విద్యయొక్క ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.
దాదాపు రెండుశతాబ్దాలకుపైగా పరాయిపాలనలో అష్టకష్టాలు పడిన మనదేశం చివరికి స్వాతంత్ర్యం సముపార్జించడంలో మనదేశానికి చెందిన చాలామంది విదేశాలలో నాణ్యమైన విద్యనభ్యసించినవారే కీలకపాత్ర వహించడం గమన్హారం.అందుకే వారు ప్రపంచచరిత్రను అధ్యయనం చేయడం ఒక్కెత్తయితే,మనదేశ చరిత్రను,సామాజిక,ఆర్థిక,రాజకీయ,సాంస్కృతిక,స్థితిగతులను తెలుసుకొని దానికనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవడానికి దోహదబడిందని చెప్పడంలో నిజంలేకపోలేదు.
స్వాతంత్ర్యసంగ్రామంలో భాగంగా 1911లో దాదాబాయి నౌరోజీ,బ్రిటిష్ అగ్రపాలకులతో నాదేశాన్ని ఇంకెన్నాళ్లయిన పాలించండి.పర్వాలేదుకానీ మాదేశ బాలబాలికలకు ఉచిత నిర్బంధవిద్యను అందించాలని ప్రాధేయపడటం విద్యయొక్క ప్రాముఖ్యతను చెప్పకనే చెబుతుంది.
నిజాంపాలనలో సైతం తెలుగుభాషను అవహేళనచేస్తూ,ఉర్దూ మాధ్యమంలో విద్యనందించినప్పుడు తెలుగు భాషోద్యమాలు,గ్రంధాలయోద్యమాలు,రాత్రిసమయాలలో రాత్రిబడులపేర్లతో విద్యనందించడం విద్యపట్ల ప్రయోజనాలను తెలియపరుస్తుంది.అంతెందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సైతం తెలంగాణవాసులకు నియామాకాలలో మోసం జరుగుతుందనే కారణాలతో తొలి,మలిదశ ఉద్యమాలు ప్రారంభంకావడం చూస్తుంటే అభివృద్ధిలో విద్యయొక్క ప్రభావం ఎంత ఉంటుందో అర్థంగాకమానదు.
అలాంటి పరిస్థితులలో ఉవ్వెత్తునలేచిన తెలంగాణ ఉద్యమం ఫలితంగా ఏర్పడిన స్వరాష్ట్రంలో విద్యావ్యవస్థ పనితీరు,నియామకాలకల్పనలో జరుగుతున్న పరిస్థితిచూస్తుంటే ఎంత అధ్వానంగా ఉన్నదో ప్రతిఒక్కరికి తెలిసిన విషయమే.“గురుదేవోభవ”, “ గురువులేని విద్య – గుడ్డివిద్య”, “దేశ భవిష్యత్తు తరగతిగది నాలుగుగోడల్లో నిర్మితమవుతుంది” లాంటి వాక్యాలు మాటలుగానే మిగిలిపోతున్నాయా ! అనే అనుమానం కలగకమానదు.
ఎందుకంటే ప్రత్యేక తెలంగాణవచ్చి ఎనిమిదిన్నర సంవత్సరాలు గడిచిపోయిన,గాడినపడని విద్యావ్యవస్థను చూస్తుంటే నిజమని చెప్పకతప్పదు.రాష్ట్రంలో 21వేలకుపైగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో 10లక్షలకుపైగా విద్యార్థులు చదువుతున్నారు.కరోనా కారణంగా రెండుసంవత్సరాలపాటు విద్యార్థులు తూ.తూ మంత్రంగానే విద్యనభ్యసించి పైతరగతులకు ప్రమోట్ కావడం మూలంగా చదువుల్లో వెనకబడిపోయారని ఇటీవల నాస్ సర్వేలో వెళ్లడయ్యింది.ఈ విషయంలో దేశంలోనే మనరాష్ట్రం చివరిస్థానంలో నిల్చడం ఒక్కెత్తయితే,ఈ విద్యాసంవత్సరం పాఠశాలలు ప్రారంభమై దాదాపు 5నెలలు గడిచిన, ప్రభుత్వ పాఠశాలలో యూనిఫామ్స్,పుస్తకాలు అందకపోవడం,సగానికిపైగా పాఠశాలలో ఉచిత మధ్యాహ్న భోజనాలకు స్వస్తిపలకడం,అరకొర వసతులతో విద్యార్థులకు కనీససౌకర్యాలు లేకపోవడం,కొన్నిపాఠశాలలో 30మంది విద్యార్థులు చదివేపాఠశాలల్లో ఒకరిద్దరు ఉపాధ్యాయులు పనిచేయడం చూస్తుంటే.విద్యాప్రమాణాలు రోజురోజుకు ఎంత దిగజారిపోతున్నాయో అర్థమవుతుంది.
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ ఏడాది ఆంగ్లమాధ్యమాన్ని ప్రారంభించాలని తలచి,ప్రభుత్వం తొమ్మిది వారాలపాటు ఉపాధ్యాయులకు శిక్షణతరగతులు నిర్వహించిన విద్యార్థులకు అది “అందని ద్రాక్షలాగే” మిగిలిపోయింది.వివిధసర్వేల నివేదికలు చూస్తుంటే కనీసం విద్యార్థులకు వ్రాయడం,చదవడంలో నైపుణ్యంలేని విద్యార్థులు అధికశాతంలో ఉండడం మూలంగా వారిలో సామర్థ్యం పెంచేందుకు కేంద్రం “ఫౌండేషన్ లిటరసి న్యూమరసి” కార్యక్రమాన్ని ప్రారంభించింది.తెలంగాణలో దీనినే “తొలిమెట్టు కార్యక్రమం” పేరుతో ఆగస్టు 15నుండి అమలుచేస్తున్నారు.రాష్ట్రంలో 4వేల పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు,8వేల పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులచే నడుస్తున్నాయి.ఒకరిద్దరూ ఉపాధ్యాయులున్న పాఠశాలలో 4లక్షలకు పైగా విద్యార్థులున్నారు.వారిలో కనీస సామర్ధ్యాలను సాధించేందుకు “తొలిమెట్టు కార్యక్రమం” మూలంగా విద్యార్థులపరిస్థితి “పెనంమీద నుండి పొయ్యిలో పడ్డట్లయ్యింది”.
అక్కడ పనిచేసే ఉపాధ్యాయులకు, విద్యార్థులకు పాఠాలు బోధించడానికి సమయం దొరకడం లేదంటే,అదనంగా ప్రతితరగతికి ప్రణాళికలు తయారుచేయడం,వీక్లీ,మంత్లీ రివ్యూ మీటింగ్ ల నిర్వహణ వల్ల అసలుకే ఎసరుగా మారింది.