దేశంలోని వామపక్ష పార్టీల్లో పెద్దదైన సీపీఐ (ఎం) కొత్త రథ సారథిగా అంటే ప్రధాన కార్యదర్శిగా తెలుగువాడైన సీతారాం ఏచూరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అది కూడా పార్టీ ఇరవై ఒకటో జాతీయ మహాసభలు తెలుగు రాష్ర్టంలోని విశాఖపట్నంలో జరిగిన సమయంలో ఏచూరి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం విశేషం.
ప్రధాన కార్యదర్శి పదవి కోసం కేరళకు చెందిన రామచంద్రన్ పిళ్లయ్ ప్రధానంగా పోటీ పడగా, అదే రాష్ర్టానికి చెందిన మాజీ మంత్రి ఎంఎ బేబీ కూడా ఉన్నారని కొందరు చెప్పారు.కాని రామచంద్రన్ పిళ్లయే ప్రధాన పోటీదారుగా ఉండి చివరకు తనంతట తానే తప్పుకున్నారు.
దీంతో ఏచూరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఆయన పేరును పదవి నుంచి దిగిపోతున్న ప్రకాశ్ కరతే ప్రతిపాదించారు.
ఏచూరి మిగతా నాయకుల కంటే వయసులో చిన్నవారు.ముఖ్యంగా పార్టీలోని యువజనుల్లో ఆయనకు మద్దతు ఎక్కువగా ఉంది.
అరవైరెండేళ్ల ఏచూరి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.ప్రధాన కార్యదర్శిగా ఆయన మూడేళ్లపాటు కొనసాగుతారు.
మూడుసార్లు ప్రధాన కార్యదర్శి అయిన కరత్ నిబంధనల ప్రకారం పోలీ చేసేందుకు అవకాశం లేదు.కరత్ హయాంలో పూర్తిగా బలం కోల్పోయిన సీపీఎంను సీతారాం ఏచూరి ఏవిధంగా బలోపేతం చేస్తారో చూడాలి.
బహుభాషా కోవిదుడు, వ్యూహకర్త, విదేశీ వ్యవహారాల్లో రాటుదేలిన ఏచూరి పార్టీకి పూర్వవైభవం తెస్తారని ఎక్కువమంది ఆశిస్తున్నారు.ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో మళ్లీ అధికారం చేజిక్కంచుకోవడానికి ఏచూరి ఎలాంటి కృషి చేస్తారో మరి…!
.