ఆడపిల్లలకు చదువులెందుకు అని బంధువులు అన్నారు.పెళ్లి చేసి పంపించేయి అని ఉచిత సలహాలు కూడా ఇచ్చారు.
కానీ ఆడపిల్లలు చదువుకుంటే అభివృద్ధి అని నమ్మి చదివించారు ఆ తల్లితండ్రులు.చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల కష్టాలను చూస్తూ ఆ అక్కాచెల్లెళ్లిద్దరూ పెరిగారు.
వాళ్ల కష్టాలను తీర్చాలని కష్టపడి కాకుండా ఇష్టపడి చదివారు.పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూశారు.
ఎట్టకేలకు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి తల్లిదండ్రుల కల నెరవేర్చారు.
అక్క ట్రాన్స్కో ఏ.ఈ.చెల్లి పంచాయతీ కార్యదర్శిగా ఎంపిక అయ్యారు.వివరాలలోకి వెళ్తే…అనంతగిరి మండలంలోని మొగలాయి కోట గ్రామానికి చెందిన గణపవరపు వెంకటాచారి, సరస్వతి దంపతుల కూతుళ్లు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.
గణపవరపు భాగ్యశ్రీ ఆరు నెలల క్రితం ట్రాన్స్కో ఏఈగా ఎంపికైంది.
మంగళవారం ప్రకటించిన గ్రామపంచాయతీ కార్యదర్శి పరీక్షల ఫలితాల్లో చిన్న కూతురు గణపవరపు ప్రియాంక పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి ఎంపికైంది.
ఒకే ఇంటికి చెందిన అక్కా చెల్లెలు ప్రభుత్వ ఉద్యోగులుగా ఎంపిక కావడంపై తల్లిదండ్రులతో పాటు గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.వారి తండ్రి వెంకటాచారి వడ్రంగి పని చేస్తూ వచ్చిన కొద్ది డబ్బులతోనే పిల్లలని చదివించాడు.ఇప్పుడు ఆ కూతురులు కన్నవారి ఋణం తీర్చుకున్నారు.