టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత, బిజినెస్ మేన్ రామ్ వీరపనేనిల వివాహం ఈ నెల 9వ తేదీన శంషాబాద్ లోని ఒక ఆలయంలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.పెళ్లి తరువాత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జీవిత భాగస్వామి రామ్ వీరపనేని గురించి ఆసక్తికరమైన విషయాలను సునీత వెల్లడించారు.
రామ్ తన సోషల్ మీడియా ఖాతాలను చూసుకునే వారని చాలా సంవత్సరాల నుంచి రామ్ తో తనకు పరిచయం ఉందని సునీత తెలిపారు.
రామ్ కు, తనకు మధ్య ఉన్న స్నేహాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని భావించి ఇరు కుటుంబాల పెద్దలతో మాట్లాడి ఒప్పించి పెళ్లి చేసుకున్నామని సునీత తెలిపారు.
రామ్ ను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చిన సమయంలో మొదట పిల్లలే తనకు గుర్తుకు వచ్చారని తను తీసుకున్న పెళ్లి నిర్ణయం వల్ల పిల్లలు ఇబ్బంది పడకూడదని తాను భావించానని సునీత తెలిపారు.చాలా సంవత్సరాల నుంచి కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకోవాలని తనకు చెబుతూనే ఉన్నారని అన్నారు.
అయితే పిల్లల వల్ల తాను పెళ్లి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయానని ప్రస్తుతం పిల్లలు పెద్దవాళ్లు కావడంతో పాటు వాళ్లకు పరిస్థితులను అర్థం చేసుకునే మెచ్యూరిటీ ఉందని తెలిపారు.పిల్లలకు రామ్ ను వివాహం చేసుకుంటున్నానని చెప్పగా పిల్లలు ఎంతో సంతోషించారని సునీత పేర్కొన్నారు.కుటుంబం తనకు ప్రతి విషయంలో మద్దతు ఇచ్చిందని.అర్థం చేసుకునే పిల్లలు లభించడం తన అదృష్టమని సునీత పేర్కొన్నారు.
రామ్ రూపంలో కష్టాల్లో, సుఖాల్లో తోడుగా నిలిచే వ్యక్తి దొరికారని సునీత అన్నారు.రామ్ లాంటి వ్యక్తి జీవిత భాగస్వామిగా లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆమె అన్నారు.
ఇరు కుటుంబాలు పెద్ద కుటుంబాలు అని అందువల్లే అతిథుల జాబితా 200కు చేరిందని సునీత వెల్లడించారు.