మానవత్వం మాయమైపోతున్న ఈ రోజుల్లో కొందరు మనుషులు తమలో ఇంకా ప్రేమ, దయ, జాలి వంటి సుగుణాలు వున్నాయని నిరూపిస్తున్నారు.తోటి వారిని ఆపదలో ఆదుకుంటూ నేనున్నా అనే భరోసాను ఇస్తున్నారు.
తాజాగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న భారత సంతతి చిన్నారి ప్రాణాలను రక్షించేందుకు సింగపూర్ వాసులు ఒక్కటయ్యారు.ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధంగా పిలిచే ‘‘ జోల్గెన్స్మా ఇంజెక్షన్ ’’ కోసం కేవలం 10 రోజుల్లోనే 2.869 మిలియన్ డాలర్లను సేకరించారు.
దేవదాన్ అనే చిన్నారి అరుదైన స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (ఎస్ఎంఏ) వ్యాధితో బాధపడుతున్నాడు.
దీనికోసం జన్యు మార్పిడి థెరపీ కోసం ఉపయోగించే జోల్గెన్స్మా ఇంజెక్షన్ ను అమెరికా సంస్థ తయారు చేస్తోంది.దీని ఖరీదు రూ.16 కోట్లు.అయితే ఇంత ఖరీదైన ఇంజెక్షన్ కొనడం మామూలు వాళ్ల వల్ల సాధ్యం కాదు.
ఈ ఔషధానికి అమెరికా ఎఫ్డీఏ అనుమతిని ఇచ్చినప్పటికీ.సింగపూర్ హెల్త్ సైన్సెస్ అథారిటీ మాత్రం ఆమోదించలేదు.
కానీ స్పెషల్ యాక్సెస్ రూట్ కింద ఈ ఇంజెక్షన్ను దిగుమతి చేసుకోవచ్చు.
చిన్నారి ప్రాణాల కోసం తల్లిదండ్రులు పడుతున్న ఆవేదనను అర్థం చేసుకున్న ‘‘రే ఆఫ్ హోప్ ’’ అనే స్వ చ్ఛంద సంస్థ ఆన్లైన్ ద్వారా ఆగస్టు 3న విరాళాలను సేకరించే పనిని ప్రారంభించింది.దేవదాన్కు ఒక నెల వయసు వున్నప్పుడే ఎస్ఎంఏ టైప్ 2 వున్నట్లు వైద్యులు నిర్థారించారు.అతని తల్లిదండ్రులు భారత సంతతికి చెందిన డేవ్ దేవరాజ్, తల్లి చైనీస్ సంతతికి చెందిన షు వెన్లు పిల్లాడిని ఎలా రక్షించుకోవాలో తెలియక కన్నీటి పర్యంతమయ్యారు.
అయితే ఫండ్ రైజింగ్ కార్యక్రమం ద్వారా అవసరమైన డబ్బు సమకూరుతున్నందుకు వారు హర్షం వ్యక్తం చేశారు.చిన్నారి తల్లి షువెన్ మాట్లాడుతూ.దేవదాన్ను రక్షించడానికి ఇంతమంది దాతలు ముందుకు వస్తారని తాము ఊహించలేదని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.వీరంతా దేవదాన్కి జీవితంలో రెండో అవకాశం ఇచ్చారని ఆమె అన్నారు.
ఆరు బయట ఇతర పిల్లలతో ఆడుకోవడానికి , వీల్ చైర్ లేకుండా తనంతట తానుగా ప్రపంచాన్ని ఆస్వాదించడానికి ఇది అతనికి మరో అవకాశమని షువెన్ అన్నారు.సింగపూర్ మీడియా కథనాల ప్రకారం ఇప్పటి వరకు సుమారు 30,000 మంది నిధుల సేకరణ కార్యక్రమానికి సహకరించారు.