డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో భారత సంతతికి చెందిన నాగేంద్రన్ ధర్మలింగానికి సింగపూర్ కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తన మానసిక స్థితి బాగా లేనందున క్షమాభిక్ష ప్రసాదించాలని ధర్మలింగం తరఫు న్యాయవాదులతో పాటు ఆన్లైన్లో పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయి.
అయితే ఇటీవల నాగేంద్రన్ కోవిడ్ బారినపడటంతో మానవతా దృక్పథంతో ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.తర్వాత ఏం జరగబోతోందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఈ వివాదం నడుస్తుండగానే.తాజాగా 2018లో డ్రగ్స్ బ్యాగ్తో పట్టుబడిన 39 ఏళ్ల మలేషియన్ – ఇండియన్కు న్యాయస్థానం మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
క్లీనింగ్ సూపర్వైజర్గా పనిచేస్తున్న మునుసామి రామమూర్తిని ఈ కేసులో బుధవారం హైకోర్టు దోషిగా తేల్చింది.మీడియా కథనాల ప్రకారం మునుసామి హార్బర్ఫ్రంట్ అవెన్యూలో పార్క్ చేసివున్న బైక్లో డ్రగ్ బ్యాగ్తో పట్టుబడ్డాడు.తొలుత 6.3 కిలోల గ్రాన్యులర్ పదార్ధంతో పట్టుబడినట్లు వార్తలు వచ్చినప్పటికీ.తర్వాత 57.54 గ్రాముల హెరాయిన్ ఉన్నట్లు కనుగొన్నారు.అయితే ఒక వ్యక్తి తన బైక్ వెనుక పెట్టేలో బ్యాగ్ను వుంచడానికి తాను అనుమతించానని, అంతేతప్ప తనకు ఎలాంటి ప్రమేయం లేదని మునుసామి చేసిన వాదనను న్యాయమూర్తి తిరస్కరించారు.అయితే సింగపూర్ చట్టాల ప్రకారం 15 గ్రాముల కంటే ఎక్కువ హెరాయిన్ అక్రమ రవాణా చేస్తే సదరు వ్యక్తికి మరణశిక్ష విధించేలా న్యాయస్థానాలకు అధికారం వుంది.
సింగపూర్లో 14 ఏళ్లుగా పనిచేస్తున్న మునుసామిని జనవరి 26, 2018 మధ్యాహ్నం హార్బర్ఫ్రంట్ సెంటర్ టవర్ 2లోని క్లీనర్ల గదిలో అరెస్ట్ చేశారు.కెప్పెల్ బే టవర్లోని ఓపెన్ ఎయిర్ కార్పార్కింగ్లో నిలిపివుంచిన అతని బైక్ను కూడా అధికారులు స్వాధీనం చేశారు.
మునుసామి బైక్ వెనుక పెట్టెలో ఎర్రటి ప్లాస్టిక్ బ్యాగ్, డ్రగ్స్ కట్టలు వున్నాయి.మునుసామి తన విచారణలో శరవణన్ అనే మలేషియాకు చెందిన వ్యక్తికి తన బైక్ వెనుక వున్న పెట్టేలో బ్యాగ్ పెట్టుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు చెప్పాడు.
కానీ న్యాయమూర్తి ఆ వాదనను పట్టించుకోలేదు.అంతేకాదు తప్పుని కప్పిపుచ్చుకునేందుకు స్టోరీ చెప్పాడని న్యాయమూర్తి జస్టిస్ లిమ్ నిర్ధారించారు.
శరవణన్ డ్రగ్స్ దందా చేస్తున్నట్లు మునుసామికి తెలిసినా అతను ఏ మాత్రం బ్యాగ్ను తనిఖీ చేయలేదని న్యాయమూర్తి మండిపడ్డారు.ఈ నేపథ్యంలోనే మునుసామికి మరణశిక్ష విధిస్తున్నట్లు జడ్జి తీర్పు వెలువరించారు.