కరోనా వైరస్ను కట్టడి చేయడంలో ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలిచింది సింగపూర్.చైనాలో కోవిడ్ 19 వెలుగు చూసినప్పటి నుంచే లాక్డౌన్ విధించి, కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.
ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నేరాన్ని బట్టి భారీగా జరిమానాలు, అవసరమైతే జైలు శిక్షను విధిస్తోంది.ఇలా రూల్స్ను అతిక్రమించిన వారిలో భారతీయులు కూడా ఉన్నారు.
ఇప్పటికే పలువురు జైలు పాలయ్యారు కూడా.తాజాగా మరో తొమ్మిది మంది భారతీయ విద్యార్ధులు కరోనా నిబంధనలు ఉల్లంఘించి జరిమానాలకు గురయ్యారు.
కోవిడ్ 19 నేపథ్యంలో సింగపూర్ ప్రభుత్వం ‘‘ సర్క్యూట్ బ్రేకర్’’ నిబంధనను అమల్లోకి తెచ్చింది.దీని ప్రకారం ఒకరి ఇంట్లో అతిథులను కలిగి వుండటం లేదా సామాజిక ప్రయోజనాల కోసం ఇతర వ్యక్తులను కలవడం చట్టవిరుద్ధం.ఈ క్రమంలో మే 5న మధ్యాహ్నం 12.50 గంటలకు కిమ్ కీట్ రోడ్లోని అపార్ట్మెంట్ వద్ద వాగ్వాదం జరగడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ అపార్ట్మెంట్ లోపల 17 మంది వ్యక్తులు ఉన్నట్లుగా గుర్తించి, వారిని అదుపులోకి తీసుకున్నారు.అనంతరం కోర్టులో హాజరుపరచగా.న్యాయమూర్తి బాలారెడ్డి వారికి జరిమానా విధించారు.
శిక్షపడిన విద్యార్ధుల్లో భారత్కు చెందిన నవదీప్ సింగ్ (20), సజాన్దీప్ సింగ్ (21), అవినాశ్ కౌర్ (27) అపార్ట్మెంట్లో అద్దెకు నివసిస్తున్నారు.నిబంధనలను అతిక్రమించి ఆరుగురు అతిథులను అపార్ట్మెంట్కు పిలిచినందుకు నవదీప్, సజాన్దీప్పై ఒక్కొక్కరికి 4,500 సింగపూర్ డాలర్ల జరిమానా విధించారు.వీరి అపార్ట్మెంట్కు వచ్చినందుకు గాను అర్పిత్ కుమార్ (27), కర్మ్జిత్ సింగ్ (20), మహమ్మద్ ఇమ్రాన్ పాసా (26), శర్మ లుకేశ్ (21), విజయ్ కుమార్ (20), వసీమ్ అక్రమ్ (33)లకు 2,500 సింగపూర్ డాలర్ల చొప్పున కోర్టు జరిమానా విధించింది.
ఒక అతిథిని ఇంటికి పిలిచినందుకు గాను అవినాశ్కు 3,500 డాలర్లు జరిమానా విధించగా, అతిథికి సంబంధించిన కేసు పెండింగ్లో ఉంది.
వీరిలో చాలామంది ఆన్లైన్ క్లాసుల కోసం, మరికొందరు టీ తాగేందుకు ఆ అపార్ట్మెంట్కు వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఇలాంటి తీరు కరోనా వ్యాప్తికి దోహదం చేస్తుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.కాగా సింగపూర్లో ఇప్పటి వరకు 36,922 మంది కోవిడ్ 19 బారినపడగా, కేవలం 24 మంది మాత్రమే మరణించడం అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు నిదర్శనం.