వృత్తి, విద్య, వ్యాపారాల కోసం వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులు వర్ణ వివక్ష, జాతి విద్వేషానికి గురవుతూనే వున్నారు.అవమానాలు, ఛీత్కారాలతో పాటు భౌతిక దాడులు చివరికి ప్రాణాలు కూడా పొగొట్టుకున్న ఉదంతాలు అనేకం.
తాజాగా ఇంగ్లాండ్లో ఓ సిక్కు ట్యాక్సీ డ్రైవర్ వేధింపులకు గురయ్యాడు.
భారత సంతతికి చెందిన వనీత్ సింగ్ (41) ఆదివారం తెల్లవారుజామున బెర్క్షైర్లోని రీడింగ్లో ఉన్న గ్రోస్వెనర్ క్యాసినో వద్ద తనపై నలుగురు వ్యక్తులు దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
‘‘ నువ్వు తాలిబన్వా’’ అని తనను ప్రశ్నించారని, నలుగురిలో ఒకడు తన తలపాగా తొలగించేందుకు కూడా ప్రయత్నించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇది తనకు ఎదురైన భయంకరమైన అనుభవమని, తాను జీవితంలో మళ్లీ నైట్ షిఫ్ట్కు వెళ్లనని వనీత్ మీడియా ఎదుట తన గోడును వెళ్లబోసుకున్నాడు.
ఈ ఘటనపై ఫిర్యాదును స్వీకరించిన థేమ్స్ వ్యాలీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఉన్నత విద్యావంతుడైన వనీత్ నిజానికి ఓ స్కూల్ టీచర్.
బెర్క్షైర్ స్లౌగ్లోని ఓ పాఠశాలలో మ్యూజిక్ టీచర్గా పనిచేస్తున్నాడు.అయితే కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ట్యాక్సీ డ్రైవర్గా మారాడు.
భార్య , ముగ్గురు పిల్లలతో కలిసి అతను టిలేహర్స్ట్లో నివసిస్తున్నాడు.
ఘటన జరిగిన రోజు రాత్రి క్యాసినో వద్ద నలుగురు ఆగంతకులు క్యాబ్ ఎక్కారని… వీరంతా శ్వేతజాతీయులేననితెలుస్తోంది.
బాధితుడు ట్యాక్సీ నడుపుతుండగా ఒకరు తలపాగా లాగి చెంపదెబ్బ కొట్టాడు.మిగిలిన వారు వెనుక నుంచి అతనిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు.ఈ సమయంలో తలపాగా మతానికి సంబంధించినదని, దాని ప్రాముఖ్యతను వివరించేందుకు ప్రయత్నించినప్పటికీ దుండగులు వినిపించుకోలేదని వనీత్ ఆవేదన వ్యక్తం చేశాడు.ఈ సంఘటన స్థానికంగా ఉన్న భారతీయుల్లో ఆగ్రహంతో పాటు భయాందోళనలను కలిగించింది.