సాధారణంగా సిక్కులు తమ మత విశ్వాసాలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తారన్న సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసు.వాటికి భంగం కలిగే పరిస్ధితే వస్తే….
ఎక్కడి దాకా వెళతారో వారికే తెలియదు.అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో మానవాళిని కాపాడేందుకు వైద్యులు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు.
ఇప్పటికే పలువురు వైద్యులు ప్రాణాలను కోల్పోగా.మరికొందరు ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
అయినప్పటికీ విధి నిర్వహణలో వారు రాజీ పడటం లేదు.
ఈ క్రమంలో భారత సంతతికి చెందిన ఇద్దరు సిక్కు వైద్య సోదరులు తమ మత విశ్వాసాలను పక్కనబెట్టి మరి వైద్యం అందిస్తున్నారు.
ఇందుకోసం అత్యంత కఠిన నిర్ణయం తీసుకున్నారు.కరోనా రోగులకు చికిత్స అందించేందుకు గాను వారు అత్యంత విలువనిచ్చే గడ్డాన్ని తీసేయించారు.సిక్కు మతస్తులు తమ సాంప్రదాయంలో భాగంగా పాంచ్ కకార్ ( ఐదు ‘‘కే’’లు) పాటించి తీరాలి.
సంజీత్ సింగ్ సలూజా, రజీత్ సింగ్ సోదరులు కెనడాలో వైద్యులుగా పనిచేస్తున్నారు.కరోనా రోగులకు చికిత్స అందించే క్రమంలో వైద్యులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.మరీ ముఖ్యంగా ఎన్-95 మాస్కులు ధరించాలి.
అయితే గడ్డం ఎక్కువగా ఉంటే అవి పెట్టుకోవడం కష్టం.దీంతో మత పెద్దలను, కుటుంబసభ్యులను, మిత్రులను సంప్రదించిన అనంతరం ఇద్దరు సోదరులు క్లీన్ షేవింగ్ చేయించుకున్నారు.
ఇందుకు సంబంధించిన కథనం అక్కడి బ్రాంట్ ఫోర్డ్ ఎక్స్పోసిటర్లో వచ్చింది.దీనిపై వారు పనిచేస్తున్న ఆసుపత్రి యాజమాన్యం కూడా సంజీత్ సింగ్, రజీత్ సింగ్ సోదరులను అభినందించింది.మరోవైపు కెనడాలో ఇప్పటి వరకు 63,496 మంది కోవిడ్ 19 బారినపడగా.4,232 మంది ప్రాణాలు కోల్పోయారు.