ఐపీఎల్ 2022 ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియ అనేది దాదాపు క్రికెట్ విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే జరిగింది.దీని తర్వాత కొత్తగా చేరనున్న అహ్మదాబాద్, లక్నో జట్లు పికప్ ఆప్షన్ తో ముగ్గురు ప్లేయర్లను నేరుగా ఎంపిక చేసుకోనున్నాయి.
మెగా ఆక్షన్ ముందు జరగనున్న ఈ పికప్ ప్రక్రియ ఆసక్తికరంగా కొనసాగనుంది.అయితే తాజా నివేదికల ప్రకారం, అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ఇప్పటికే శ్రేయస్ అయ్యర్ ను కెప్టెన్గా ఎంపిక చేసుకుందని తెలుస్తోంది.
ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్సీ నుంచి తప్పించి రిషబ్ పంత్ కి ఆ పగ్గాలను అప్పజెప్పింది.దాంతో శ్రేయస్ అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్ లో కొనసాగేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో నయా ఫ్రాంచైజీ అయిన అహ్మదాబాద్ కెప్టెన్గా తమ జట్టులో చేర్చుకుంటామని శ్రేయస్ అయ్యర్కు బంపరాఫర్ ఇచ్చింది.అంతేకాదు, ఏకంగా రూ.15 కోట్లను ఆఫర్ చేసింది.ఇంతకంటే మంచి డీల్ రాదని భావించిన శ్రేయస్ వెంటనే అహ్మదాబాద్ లో కెప్టెన్గా చేరేందుకు ఓకే చెప్పారని వార్తలు వస్తున్నాయి.
అయితే శ్రేయస్ ఎంపిక దాదాపు ఖాయమయిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మిగతా ప్లేయర్లు ఎవరనే ప్రశ్న తలెత్తుతోంది.ఈ క్రమంలో మరో ప్రచారం కూడా జరుగుతోంది.ఆ ప్రచారం ప్రకారం, సౌతాఫ్రికా పేసర్ కగిసో రబడాను పికప్ చేసుకునేందుకు అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ప్రయత్నాలు చేస్తోంది.అయితే రబడాకు కూడా భారీ ధరను ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం.ఐపీఎల్ 2020 సీజన్లో 30 వికెట్లు పడగొట్టి హయ్యెస్ట్ వికెట్ టేకర్గా రబడా నిలిచాడు.2021 సీజన్లో మాత్రం నిరాశ పరిచాడు.ఈ సీజన్లో కేవలం 15 వికెట్లు మాత్రమే తీసి ఢిల్లీ క్యాపిటల్స్ ని నిరాశపరిచాడు.దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అతన్ని వదులుకునేందుకు అన్రిచో నోర్జ్ను రిటైన్ చేసేసుకుంది.
ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ ఫ్రాంచైజీ రబడాతో సంప్రదింపులు జరుపుతోంది.మూడో ప్లేయర్గా హర్షల్ పటేల్ లేదా శిఖర్ ధావన్లో ఒకరిని సెలెక్ట్ చేసుకునేందుకు అహ్మదాబాద్ యాజమాన్యం ప్రయత్నిస్తోంది.