ఈరోజు ఇరవైఎనిమిదో తేదీ.రేపు ఇరవై తొమ్మిదో తేదీ.
ఎల్లుండి ముప్పయ్యో తారీకు.రేపు ఒక్కరోజు గడిస్తే ఎల్లుండి ఏం జరుగుతుంది? ముంబయి పేలుళ్లలో దోషి, ఉగ్రవాది యాకూబ్ మెమన్కు ఉరిశిక్ష అమలు జరుగుతుందా? లేదా? ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ జరుగుతోంది.యాకూబ్ను ఉరి తీయొద్దని కొన్ని పత్రికలు సంపాదకీయాలు కూడా రాశాయి.చివరకు ఉరి శిక్ష అమలు చేయాలా? వద్దా? అనే విషయమై సుప్రీం కోర్టు న్యాయమూర్తుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సుప్రీం కోర్టు ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు చెరో అభిప్రాయం వ్యక్తం చేశారు.జస్టిస్ అనిల్ దవే ఉరి శిక్షకు అనుకూలంగా ఉన్నారు.
యాకూబ్ మరణ శిక్షను ఆపకూడదని అభిప్రాయపడ్డారు.రాజు దోషిని శిక్షించకపోతే దోషి చేసిన పాపమంతా రాజుకు అంటుకుంటుందని అన్నారు.
అయితే జస్టిస్ కురియన్ జోసెఫ్ దీన్ని తోసిపుచ్చారు.నిబంధనలు అతిక్రమించినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు.
ఒక వ్యక్తి జీవితాన్ని రక్షించడంలో సాంకేతిక అంశాలు అడ్డు కాకూడదని అన్నారు.ఉరిశిక్ష విధిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పును సమీక్షించాలని యాకూబ్ పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్ను సుప్రీం కోర్టు గత వారం కొట్టేసింది.
ఇప్పుడు న్యామూర్తులు విభేదించిన నేపథ్యంలో ఉరిశిక్ష అమలు చేస్తారా? చెయ్యరా? అనేది ఉత్కంఠగా మారింది.శిక్ష అమలుకు ఒక్కరోజే మిగిలి ఉంది.
ఈలోగానే నిర్ణయం తీసుకోవాలి.దేశంలోని అనేకమంది మేధావులు, న్యాయనిపుణులు, వివిధ రంగాల ప్రముఖులు ఉరి శిక్ష రద్దు చేయాలని కోరుతున్నారు.
అజ్మల్ కసబ్, అఫ్జల్ గురు విషయంలో కూడా ఇంత స్పందన వచ్చి ఉండదు.