ప్రముఖ కొరియోగ్రాఫర్, డాన్సర్ శివ శంకర్ మాస్టర్ కరోనా బారిన పడి హైదరాబాదులోని గచ్చిబౌలి ఏఐజి హాస్పిటల్ లో చేరారు.అయితే తాజాగా ఆదివారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందారు.
ఆయన మరణవార్తతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది.శివ శంకర్ మాస్టర్ దేశవ్యాప్తంగా దాదాపుగా పది భాషలలో కొరియోగ్రాఫర్ గా పనిచేశారు.
అంతేకాకుండా దాదాపుగా ఎనిమిది వందల సినిమాలకు పైగా డాన్స్ మాస్టర్ గా పనిచేసిన ఆయన పలు భాషల్లో ఉత్తమ కొరియోగ్రాఫర్ గా కూడా అవార్డులను అందుకున్నారు.
అలాగే టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన మగధీర సినిమాకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన శివ శంకర్ మాస్టర్ కు జాతీయ అవార్డు సైతం లభించింది.
అంతేకాకుండా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన బాహుబలి సినిమాకు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు.ఇక శివ శంకర్ మాస్టర్ భౌతికకాయాన్ని నేడు హైదరాబాద్ పంచవటిలో ఆయన స్వగృహానికి తీసుకెళ్లనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈరోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానం లో శివ శంకర్ మాస్టర్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తెలుగు ఇండస్ట్రీ వారే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం సినీ పరిశ్రమకు సంబంధించిన పలువురు ప్రముఖులు అతని అంత్యక్రియలలో పాల్గొనే అవకాశం ఉంది.శివ శంకర్ మాస్టర్ పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ కూడా ప్రస్తుతం కరోనా మహమ్మారితో పోరాడుతున్నారు.ఆయన పరిస్థితి కొద్దిగా ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ఇక శివ శంకర్ మాస్టర్ మృతి చెందారన్న వార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు హీరోలు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.