అమెరికాలోని అతిపెద్ద నగరం, దేశ వాణిజ్య రాజధాని న్యూయార్క్ సిటీ కౌన్సిల్ ఎన్నికల్లో దక్షిణాసియా వాసులు చరిత్ర సృష్టించారు.ఈ ఎన్నికల్లో భారతీయ అమెరికన్ న్యాయవాది శేఖర్ కృష్ణన్, బంగ్లాదేశ్- అమెరికన్ షహానా హనీఫ్లు న్యూయార్క్ సిటీ కౌన్సిల్కు ఎన్నికైన తొలి దక్షిణాసియా వాసులుగా రికార్డుల్లోకెక్కారు.
అంతేకాదు ఈ ఎన్నికల్లో గెలిచిన తొలి ముస్లిం మహిళగా హనీఫ్ మరో అరుదైన గౌరవం పొందారు.కేరళ నుంచి అమెరికాకు వలస వచ్చిన భారతీయులకు జన్మించారు కృష్ణన్.
మంగళవారం జరిగిన నగర కౌన్సిల్ ఎన్నికలలో జిల్లా 25లోని క్వీన్స్ జాక్సన్ హైట్స్, ఎల్మ్హర్ట్స్ల నుంచి ఆయన ఎన్నికయ్యారు.తన రిపబ్లికన్ ప్రత్యర్ధి షా హక్ను కృష్ణన్ ఓడించారు.
తనను నమ్మి ఓటు వేసినందుకు జాక్సన్ హైట్స్, ఎల్మ్హర్ట్స్కు శేఖర్ కృష్ణన్ కృతజ్ఞతలు తెలిపారు.అందరి తరపున పోరాడుతానని ఆయన ట్వీట్ చేశారు.
తన తల్లిదండ్రులు దాదాపు 30 ఏళ్ల క్రితం అమెరికాకు వలస వచ్చారని.వారు ఔషధ పరిశ్రమలో పరిశోధనా శాస్త్రవేత్తలుగా తమ కెరీర్లో వివక్షకు వ్యతిరేకంగా పోరాడారని కృష్ణన్ ఓ సందర్భంలో చెప్పారు.
తన పేరెంట్స్ చట్టబద్ధమైన పత్రాలు, సరైన అర్హతతోనే అమెరికాకు వచ్చారని.అయినప్పటికీ వారు ఎంతో పోరాడారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక బ్రూక్లిన్ డిస్ట్రిక్ట్ 39 నుంచి న్యూయార్క్ సిటీ కౌన్సిల్కు ఎన్నికైన ముస్లిం మహిళ హనీఫ్ విషయానికి వస్తే.ఆమె అత్యధికంగా 89.3 శాతం ఓట్లను సాధించారు.కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఆమె ప్రత్యర్ధికి కేవలం 8 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
అధికారిక గణాంకాల ప్రకారం న్యూయార్క్ నగరంలో 7,69,000 మంది ముస్లింలు వున్నట్లు అంచనా.అయితే భారత సంతతికి చెందిన డెమొక్రాట్ ఫెలిసియా సింగ్.క్వీన్స్ డిస్ట్రిక్స్ 32లో రిపబ్లికన్ అభ్యర్ధి జోవాన్ అరియోలా చేతిలో ఓటమి పాలయ్యారు.
కాగా.న్యూయార్క్ నగరానికి తదుపరి మేయర్గా మాజీ పోలీస్ అధికారి, డెమొక్రాటిక్ నేత ఎరిక్ ఆడమ్స్ ఎన్నికైన సంగతి తెలిసిందే.తద్వారా అమెరికాలోని అతిపెద్ద నగరానికి సారథ్యం వహించనున్న రెండో ఆఫ్రికన్ అమెరికన్గా ఆడమ్స్ రికార్డుల్లోకెక్కారు.ప్రజా భద్రత, శ్రామిక తరగతి నివాసితులకు గొంతుగా మారతానని ఆయన ఎన్నికల ప్రచారంలో వాగ్థానం చేశారు.61 ఏళ్ల ఆడమ్స్ జనవరిలో డెమొక్రాట్ బిల్ డి బ్లాసియో నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు.బ్లాసియో దాదాపు ఎనిమిదేళ్ల పాటు న్యూయార్క్ మేయర్గా విధులు నిర్వర్తించారు.