మహిళలపై వేధింపులను అరికట్టటంలో షీటీమ్స్ ఒక బలమైన సాధనంగా జిల్లాలో పని చేస్తున్నాయని పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ అన్నారు.బహిరంగ ప్రదేశాలలో మహిళలకు, ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ముఖ్యంగా మహిళలు, పిల్లల రక్షణకు సెప్టెంబర్ నెలలో తీసుకున్న చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ లో షీటీమ్ బృందాలతో పోలీస్ కమిషనర్ ఆడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.వ్యక్తుల ఆలోచనల్లో, దృక్పథంలో మార్పు తీసుకురావటానికి షీటీమ్స్ చొరవ తీసుకొని వినూత్న కార్యక్రమాలను అమలు చేయాలని సూచించారు.
తొలిసారి నేరం చేస్తూ పట్టుబడిన వారికి ప్రొఫెషనల్ కౌన్సెలర్లతో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారని, ఆ తర్వాత నిర్దిష్టకాలం ఆ వ్యక్తులపై పర్యవేక్షణ ఉంటుంది.మళ్లీ నేరాలకు పాల్పడితే వారిపై నిర్భయ తదితర చట్టాల ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.
డయల్ 100, వాట్సాప్, హ్యాక్ఐ యాప్, ఫేస్బుక్, ఈమెయిల్, ట్విట్టర్, క్యూఆర్ కోడ్, షీటీమ్స్ వెబ్సైట్ రూపాల్లో షీటీమ్స్ సేవలు, సైబర్ నేరాలను నిరోధించేందుకు 24 గంటలు అందుబాటులో ఉంటున్నాయని ,అవసరమైన సమయాలలో సద్వినియోగం చేసుకొవాలని సూచించారు.ఇప్పటికే సైబర్ అంబాసిడర్లుగా శిక్షణ పొందిన విద్యార్థులు తమకు స్వయంగా లేదా ఇతర పిల్లలకు ఎదురయ్యే ఆన్లైన్ వేధింపులను ఎదుర్కోవటంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు.