అతడో నేరగాడు.అప్పటికే రెండు కేసులకు సంబంధించి పోలీసు రికార్డుల్లో వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నాడు.
అయితేనేం తన నేర ప్రవృత్తిని కొనసాగించాడు.ఈ క్రమంలో ఓ రాత్రి ఓ ఇంటిలో దూరాడు.
ఆ ఇంటిలోని మహిళతో పాటు ఆమె కూతురిపై అత్యాచారయత్నం చేయబోయాడు.తానెలాగో తప్పించుకున్న ఆ మహిళ… సదరు దుర్మార్గుడు తన కూతురుపై లంఘించడాన్ని జీర్ణించుకోలేకపోయింది.
అతడి యత్నాన్ని తీవ్రంగా పరిగణించింది.అంతే, ఆడపులిలా గర్జించింది.
రేపిస్ట్ పై లంఘించి ఒక్క దెబ్బతో అతడిని మట్టి కరిపించింది.
ఆ తర్వాత కూడా కోపం చల్లారని ఆ మహిళ చేతిలో గొడ్డలి పట్టుకుని అతడి జననాంగానాలను కోసి పారేసింది.
అప్పటికీ ఆవేశం తగ్గని ఆమె అతడిని కసిదీరా నరికి చంపేసింది.ఆ తర్వాత తమ పొరుగు మహిళలను సాయంగా పిలుచుకుని ఆ దుర్మార్గుడి శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేసింది.
రేపిస్ట్ ల వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్న ఈ ఘటన అస్సాం లోని భారాజులి గ్రామంలో జింజియా ఏరియా లో ఈ నెల 4న చోటుచేసుకుంది.
ఈ ఘటనలో కృష్ణ భుమిజ్ అనే నేరగాడు హతమయ్యాడు.
ఇక అతడు కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసు కింద అతడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మొన్న (మంగళవారం) రాత్రి రీటా ఒరాంగ్ అనే గిరిజన మహిళను ఆమె భర్త సహా అరెస్ట్ చేశారు.విచారణలో భాగంగా నేరాన్ని ఒప్పుకున్న రీటా… తానెందుకు నేరం చేశానన్న విషయాన్ని పోలీసులకు కళ్లకు కట్టినట్టు చెప్పింది.