షర్మిల ఎప్పుడయితే తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారో అప్పటి నుంచి ఆమెకు కాలం సరిగా కలిసిరానట్టుగానే కనిపిస్తోంది.పార్టీ పేరును ప్రకటించక ముందే తెలంగాణ అంతటా పర్యటించి, తన క్రేజ్ పెంచుకోవడంతో పాటు, భారీ ఎత్తున ఇతర పార్టీ నాయకులను చేర్చుకోవాలని ఆమె ముందుగా ప్లాన్ చేసుకున్నారు.
కానీ అనూహ్యంగా కరోనా వైరస్ ప్రభావం, లాక్ డౌన్ తదితర కారణాలతో ఆమె ముందుగా అనుకున్న ఏ నిర్ణయాలు అమలు కాలేదు.అయితే పార్టీ పేరును ప్రకటించకుండానే పెద్ద ఎత్తున పార్టీ పదవులను ఆమె భర్తీ చేశారు.
జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా కమిటీలను నియమించి సర్వం సిద్ధం చేసుకున్నారు.
జూలై ఎనిమిదో తేదీన వై ఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని పార్టీ పేరును ప్రకటించేందుకు ఆమె సిద్ధమవుతున్నారు.
అయితే ముందుగా ఎల్బీ స్టేడియంలో లక్షలాది మంది జనసమూహంలో పార్టీ పేరును అట్టహాసంగా ప్రకటించి, బలనిరూపణకు దిగాలని షర్మిల ప్లాన్ చేసినా, ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.కేవలం వర్చువల్ విధానంలో పార్టీ పేరును ప్రకటించి ,రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి ,కార్యక్రమం మొత్తం జనాలందరూ చూసేలా ఏర్పాట్లు చేస్తుండటంపై పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇదంతా కోవిడ్ కారణంగానే చేస్తున్నట్లుగా షర్మిల అనుచరులు చెబుతున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి ఆదరణ అంతంత మాత్రంగా ఉండటం, పెద్దగా పేరున్న నేతలెవరూ పార్టీలో చేరకపోవడం, భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినా, ఆ స్థాయిలో జనసమీకరణ చేయలేకపోతే మొదటికే మోసం వస్తుందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.దీనిపై రాష్ట్రవ్యాప్తంగా షర్మిల పార్టీ లో యాక్టివ్ గా ఉన్న నేతలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.పార్టీని గ్రామీణ స్థాయి వరకు తీసుకు వెళ్లాలంటే అది వర్చువల్ మీటింగు తో అయ్యేపని కాదు అని, బహిరంగ సభ నిర్వహించి పార్టీ పేరు ప్రకటిస్తే వచ్చే ఊపు వర్చువల్ మీటింగ్ ద్వారా రాదు అనేది వారి వాదన గా తెలుస్తోంది.
షర్మిల పార్టీలో చేరికలు అంతంత మాత్రంగా ఉండడం, పదవులు తీసుకున్న నాయకులు తమకు ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తితో పార్టీకి దూరమయ్యేందుకు సిద్ధం అవుతుండడం వంటి వ్యవహారాలు ఇబ్బందికరంగా మారాయి.
తాజాగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కె టి నరసింహ రెడ్డి అనే నాయకుడు సన్నాహక కమిటీలకు తాను రాజీనామా చేస్తున్న అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే.అలాగే ఇటీవల కాంగ్రెస్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ మారుతారనే ఊహాగానాలు రావడంతో, షర్మిల పార్టీ ప్రతినిధులు ఆయనను సంప్రదించినట్లు తెలుస్తోంది.
తమ పార్టీలోకి వస్తే తగిన ప్రాధాన్యం ఇస్తామని వారు చెప్పినా వెంకటరెడ్డి పెద్దగా పట్టించుకోలేదట. చేరికలు ఎక్కువగా లేకపోవడానికి కారణం షర్మిల పార్టీ కి సరైన దిశా నిర్దేశం లేకపోవడమే కారణమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.ఇప్పుడు పార్టీలో చెలరేగిన అసంతృప్తిని షర్మిల ఎలా చల్లారుస్తారో చూడాలి.