తెలంగాణ కొత్త పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల ఇక తమకు తిరుగులేదు అని, తామే 2023 ఎన్నికల్లో అధికారంలోకి రాబోతున్నాము అంటూ ధీమా ను వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల సమయం వరకు తెలంగాణలో నెలకొన్న వివిధ సమస్యలను ప్రస్తావిస్తూ, అధికార పార్టీని ఇరుకున పెట్టడమే కాకుండా, తమ రాజకీయ ప్రత్యర్దులయిన కాంగ్రెస్, బిజెపి నేతల వ్యవహారాలను ప్రస్తావిస్తూ ముందుకు వెళ్ళాలి అనేది వ్యూహంగా కనిపిస్తోంది.
అలాగే గతంలో తన తండ్రి ఏ విధంగా అయితే పాదయాత్ర నిర్వహించి సక్సెస్ అయ్యారో అదే విధంగా తెలంగాణ అంతటా పాదయాత్ర నిర్వహించి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనను గుర్తుచేస్తూ, ప్రజల్లో ఆదరణ సంపాదించాలని ఆమె వ్యూహం రచించుకున్నారు.
అయితే అసలైన విషయంపై మాత్రం ఆమె కాస్త ఆందోళనలో ఉన్నారని, తాను పార్టీ పెడతానని ప్రకటించగానే పెద్దఎత్తున ఇతర పార్టీల నాయకులు చేరుతారని ఆమె భావించినా, చేరికలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.పార్టీ పేరును ప్రకటించినా, పరిస్థితి అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండడం, చేరికలు ఊపందుకునే అవకాశం కనిపించక పోవడం కాస్త ఇబ్బందికరంగానే మారింది.అసలు వైఎస్సార్ టీపీలో షర్మిల తరువాత చెప్పుకోదగిన నాయకుడు కనిపించడం లేదు.
అలాగే వైస్ ను ఆరాధించే నాయకులు చాలామంది ఇప్పటికే వివిధ పార్టీల్లో చేరడమే కాకుండా వివిధ కీలకమైన పదవుల్లో ఉండడంతో, వారంతా ఇప్పుడు ఆ పదవులను వదులుకొని రావడం అనుమానంగానే ఉంది.
అయితే కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్ ల నుంచి చేరికలు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఉండేలా కనిపిస్తున్నాయి.
అప్పుడు కూడా టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు మాత్రమే ప్రత్యామ్నాయంగా షర్మిల పార్టీ వైపు వస్తారు అనే అంచనాలు ఉన్నాయి.ముఖ్యంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించడం షర్మిల పార్టీకి ఇబ్బందికరంగా మారింది.
కాంగ్రెస్ లో ఉన్న మెజారిటీ రెడ్డి సామాజిక వర్గం నాయకులు తమవైపు వస్తారని షర్మిల ఆశలు పెట్టుకోగా, రేవంత్ కు ఆ పదవి దక్కడంతో ఇప్పుడు వారంతా ఆ ఆలోచనను విరమించుకున్నారు.
ఇక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి సీనియర్ నాయకుల ఆశీస్సులు షర్మిల పార్టీకి ఉన్నా, ఆయన కాంగ్రెస్ ను వీడి వైఎస్సార్ టిపీ లో చేరే అవకాశమే కనిపించడం లేదు.ఇక బిజెపి నుంచి పరిస్థితి అలాగే ఉంది.కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉండటంతో ఎవరూ బీజేపీని వీడెందుకు ఇష్టపడం లేదు.
కేవలం ఎన్నికల సమయంలోనే అది కూడా అసంతృప్త నాయకులు మాత్రమే వలస వచ్చే అవకాశం ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.