తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చేందుకు పాదయాత్రను నమ్ముకున్న వైఎస్ షర్మిల ను మీడియాతో సహా ఎవరు పట్టించుకోవడం లేదు.అసలు ఆ పార్టీలో పెద్దగా చేరికలు లేకపోవడంతో షర్మిల రాబోయే ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేరని అంతా భావిస్తూనే వస్తున్నారు.
అయితే రెండు రోజులుగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ పేరును జనాల్లో మారుమోగేలా చేశాయి.ముఖ్యంగా షర్మిల కాన్వాయ్ పై దాడి జరగడం , ఆమె పాదయాత్రను అడ్డుకోవడం , దీనికి నిరసనగా ప్రగతి భవన్ ముట్టడికి షర్మిల తమ పార్టీ కార్యకర్తలతో ప్రయత్నించిన క్రమంలో ఆమెను కారుతో సహా పోలీస్ స్టేషన్ కు తరలించి అరెస్ట్ చేయడం వంటి వ్యవహారాలతో షర్మిల ఇమేజ్ అమాంతం పెరిగినట్టే కనిపించింది.
ఎప్పుడూ షర్మిల పై విమర్శలు చేసే కాంగ్రెస్, బిజెపి నేతలు సైతం షర్మిల విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విమర్శలు చేశారు.దీంతో అనూహ్యంగా వచ్చిన సానుభూతి టిఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారడంతో, దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ నష్ట నివారణ చర్యలకు దిగారు.
ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో షర్మిలపై దాడి జరగడం, హైదరాబాదులో అరెస్టు కావడం, ఆ తర్వాత హైకోర్టు నుంచి షరతులతో కూడిన బెయిల్ తెచ్చుకోవడం వంటివి చోటు చేసుకున్నాయి.ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చెన్నారావుపేట మండలం, శంకరం తండా వద్ద షర్మిల పై దాడి జరిగింది.
షర్మిల కాన్వాయ్ లోని వాహనాన్ని టిఆర్ఎస్ కార్యకర్తలు , నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులు దాడి చేయడంతో అక్కడ పరిస్థితి అదుపుతప్పింది.
షర్మిల కాన్వాయ్ లోని వాహనంపై ఎమ్మెల్యే అనుచరులుగా అనుమానిస్తున్న కొంతమంది పెట్రోల్ పోసి నిప్పంటించారు.అలాగే కారు అద్దాలను పగలగొట్టారు.అక్కడితో ఆగకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడం, దానికి నిప్పంటించడం, ఆ తరువాత షర్మిల పార్టీకి చెందిన ఫ్లెక్సీలను తగలబెట్టడం వంటి వ్యవహారాలు చోటుచేసుకున్నాయి.
అయితే దాడి చేసిన వారిని అరెస్ట్ చేయకుండా, షర్మిలను హైదరాబాదులో పోలీసులు అరెస్ట్ చేయడం వంటివి టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు వ్యక్తం కావడానికి కారణమయ్యాయి .ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు వైఫల్యం ఉందని భావించిన కేసీఆర్ వరంగల్ నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి పై బదిలీ వేటు వేసినట్లు సమాచారం.ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
మొత్తంగా షర్మిల వ్యవహారంలో సిపి పై బదిలీ వేటు వేసి ఇదంతా పోలీసులు వైఫల్యం గానే కెసిఆర్ చెప్పే ప్రయత్నం చేస్తూ, ఈ వ్యవహారంతో టీఆర్ఎస్ కు సంబంధం లేదన్నట్టుగానే చేతులు దులిపేసుకున్నారనే విమర్శలు మొదలయ్యాయి.