తెలంగాణలో ఒంటరి పోరాటం అన్నట్లుగా వైఎస్ షర్మిల రాజకీయ ప్రస్థానం కొనసాగుతోంది.అధికార పార్టీ , జాతీయ పార్టీలు అన్న భేదం లేకుండా అందరిపైనా విమర్శలు చేస్తూ రాజకీయంగా పై మెట్టు ఎక్కేందుకు షర్మిల ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఆమెను ఎవరు పట్టించుకోవట్లేదు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు.ఇంకా పార్టీ పేరు ప్రకటించకపోవడం , షర్మిల పార్టీలోకి వెళ్లేందుకు మిగతా పార్టీల నాయకులు పెద్దగా ఆసక్తి చూపించకపోవడం, వంటి ఎన్నో కారణాలతో షర్మిల చాలా కాలంగా సైలెంట్ గానే ఉంటున్నారు.
తెలంగాణలో తాము ఉన్నాము అన్నట్లుగా అప్పుడప్పుడు ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఏదో ఒక అంశంపై స్పందిస్తూ, తమ ఉనికిని చాటుకునేందుకు షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారు.అయినా ఆమెకు పెద్దగా కలిసి రావడం లేదు అనే చెప్పాలి.
షర్మిల రాజకీయంగా యాక్టివ్ అవుదామనుకున్న సమయంలోనే కరోనా వైరస్ తెలంగాణలో తీవ్రం అవ్వడం, ఆమె క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసేందుకు కానీ, పొలిటికల్ గా యాక్టివ్ అయ్యేందుకు అవకాశం ఏర్పడలేదు.
అయితే ఇప్పుడు అదే కరోనాను తమకు అనుకూలంగా మార్చుకుని, రాజకీయంగా మరింత పట్టు సాధించేందుకు షర్మిల ఆపదలో YSSR టీమ్ ను ఏర్పాటు చేశారు.
దీనిపై శుక్రవారమే ఆమె కీలక నిర్ణయం తీసుకున్నారు.కరోనా కారణంగా జీవిత భాగస్వాములను , కన్న బిడ్డలను , అయిన వారిని కోల్పోయిన మహిళలకు ఆసరాగా నిలుస్తానని ప్రకటించారు.
కరోనా మహమ్మారి తో తమ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచే ఎంతో మంది చనిపోయారని షర్మిల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కుటుంబ పెద్ద దిక్కుగా నిలిచే వారిని కోల్పోయి, నిరాశ నిస్పృహలతో కుంగిపోతున్న మహిళలను పట్టించుకోవాలనే ఉద్దేశంతో వైఎస్సార్ టీమ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె చెప్పారు.
తెలంగాణ ఆడబిడ్డలు ధైర్యం కోల్పోకూడదు అని, మీ కాళ్ళపై మీరు నిలబడడానికి మళ్లీ మీ జీవితం సాఫీగా సాగేందుకు నా వంతుగా ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నాను.మీరంతా వైయస్సార్ కుటుంబ సభ్యులని భావిస్తున్నాను.ఇకపై వైయస్సార్ టీం ఆపదలో మీకు అండగా ఉంటుంది.సాయం కావలసి వస్తే 040 48213268 ఫోన్ నంబర్ కి సమాచారం అందించాలి అని షర్మిల చెబుతున్నారు.
అయితే ఇదంతా తనకు తెలంగాణలో మైలేజ్ తీసుకువస్తుందని, ముఖ్యంగా మహిళల్లో తమకు ఆదరణ పెరిగేలా చేస్తుంది అనే లెక్కల్లో షర్మిల ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.ఏ కరోనా అయితే రాజకీయంగా ముందుకు వెళ్లేందుకు ఇబ్బందికరంగా మారిందో, అదే కరోనాను ఉపయోగించి రాజకీయ మైలేజ్ పొందే ఆలోచనలో షర్మిల ఉన్నట్టు గా కనిపిస్తున్నారు.