భారతదేశంతో పాటు ప్రపంచంలోని ఆయా దేశాలను కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.వైరస్ చైన్ను బ్రేక్ చేసేందుకు గాను కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి ప్రభుత్వాలు.
ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ను ఎదుర్కోవడానికి వ్యాక్సినేషన్ ఒక్కటే మందని నిపుణులు చెబుతున్నారు.దీంతో ఆయా దేశాలు వ్యాక్సినేషన్ను పెద్ద ఎత్తున చేపడుతున్నాయి.
ధనిక దేశాలు ఈ విషయంలో ముందున్నాయి.కానీ నిరుపేద దేశాలు అంతర్జాతీయ సాయంపైనే ఆధారపడుతున్నాయి.
కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో వ్యాక్సిన్కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.ఒక్క భారతదేశం విషయానికి వస్తే.
సెకండ్ వేవ్లో కరోనాతో తలపడేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన తరుణంలో.డిమాండ్ మేరకు టీకాల ఉత్పత్తి జరగడం లేదు.
మార్చి నెలలో వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు వెనుకాడటం, కొత్త ఇన్ఫెక్షన్ రేట్లు నియంత్రణలో ఉండటం కారణంగా వ్యాక్సిన్ సరఫరాలకు మించి డిమాండ్ ఏర్పడలేదు.కానీ ఏప్రిల్ 1 నుంచి దేశంలో వైరస్ వ్యాప్తి ఉన్నట్లుండి పెరిగిపోవడం, వ్యాక్సిన్ అర్హుల వయస్సును 45 ఏళ్లకు కుదించడంతో డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోయింది.
ఇప్పటికే ఉత్పత్తి సామర్థ్యం పెంపుదల సంభవించి ఉండాలి.కానీ దాని ప్లానింగ్ విషయంలో కేంద్రం స్పష్టంగా వైఫల్యం చెందింది.వ్యాక్సిన్ నిల్వలు తరిగిపోయిన తర్వాత రోజువారీ డిమాండ్–సప్లయ్ అంతరం రోజుకు 15 నుంచి 20 లక్షల వరకు ఉంటుందని అంచనా.పెరుగుతున్న డిమాండును ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న రెండు సంస్థల ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యం సరిపోతుందా అనేది పెద్ద ప్రశ్న.
సీరమ్ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాగ్జిన్ను ఎంత వేగంగా మార్కెట్లోకి తీసుకురాగలరన్న దానిపైనే ప్రధాని ఆశిస్తున్న టీకా ఉత్సవ్ కార్యక్రమం ఆధారపడి ఉంది.నెలకు పది కోట్ల టీకాలను తయారు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేయాలని సీరమ్ సంస్థ సీఈవో అదార్ పూనావాలా స్పష్టం చేశారు.
ప్రస్తుతానికైతే సీరమ్ నెలవారీగా తయారు చేస్తున్న ఆరు కోట్ల టీకాల తయారీ కూడా చేయడం సాధ్యం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి.ఇక కోవాగ్జిన్ టీకాను తయారు చేస్తున్న భారత్ బయోటిక్ నెలకు కోటి డోసుల కంటే తక్కువ తయారీ సామర్థ్యంతో ఉంది.
తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ఆర్థిక సహాయం చేయాలంటూ ఈ సంస్థ ఫిబ్రవరి లోనే కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
ఇక అన్నింటికి మించి వ్యాక్సిన్ తయారు చేయడానికి కావాల్సిన ముడిసరుకులను భారత్.
అమెరికా, చైనా తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది.అయితే అక్కడ కూడా కరోనా వేవ్ కారణంగా ఎగుమతులపై ఆయా దేశాలు నిషేధం విధించాయి.
దీంతో వ్యాక్సిన్ల తయారీకి అవసరమైన ముడి పదార్థాల ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను కోరారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈఓ అదర్ పూనావాలా.వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచేందుకు వీలుగా ఇతర దేశాలకు రా మెటీరియల్ ఎగుమతిపై నిషేధాన్ని ఉపసంహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
వైరస్ను ఎదుర్కోవడంలో నిజంగా ఐక్యంగా ఉండాలంటే, వ్యాక్సిన్ సంబంధిత ముడి పదార్ధాలు బయటి దేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని పూనావాలా కోరారు.
అస్ట్రాజెనికా-ఆక్స్ఫర్డ్ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ను మన దేశంలో సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే.కోవిడ్-19 వ్యాక్సిన్ సరఫరాలో జాప్యం జరిగిన నేపథ్యంలో సీరంకు అస్ట్రాజెనికా నుంచి లీగల్ నోటీసు వచ్చిన కొద్దిసేపటికే పూనావాలా ఈ ట్వీట్ చేయడం గమనార్హం.మరి ఆయన విజ్ఞప్తిపై బైడెన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.